
హైదరాబాద్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్లో పుజారా పరుగుల వరద పారిస్తోన్న సంగతి తెలిసిందే. సిడ్నీ వేదికగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో ఛటేశ్వర్ పుజారా అరుదైన ఘనత సాధించాడు. ఆసీస్ గడ్డపై ఓ టెస్టు సిరిస్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు.
గురువారం ఆరంభమైన నాలుగో టెస్టు మ్యాచ్లో కేవలం 199 బంతుల్లోనే 13 ఫోర్ల సాయంతో ఛటేశ్వర్ పుజారా సెంచరీ సాధించాడు. స్టార్క్ బౌలింగ్లో బంతిని బౌండరీకి పంపడంతో పుజారా 100 పరుగులను పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో పుజారాకు ఇది 18వ సెంచరీ కాగా, ఈ సిరిస్లో మూడోది కావడం విశేషం.
దీంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఎలైట్ జాబితాలో పుజారా చేరాడు. ఆసీస్ గడ్డపై ఇప్పటివరకు మూడు లేదా అంతకుమించి టెస్టు సెంచరీలు చేసింది ఇద్దరే ఇద్దరు. 1977-78 ఆస్ట్రేలియా పర్యటనలో సునీల్ గవాస్కర్ 3 టెస్టు సెంచరీలు చేయగా, 2014-15 పర్యటనలో కోహ్లీ 4 టెస్టు సెంచరీలు సాధించాడు.
మరోవైపు ఉపఖండం బయట జరిగిన టెస్టుల్లో 3 లేదా అంతకుమించి సెంచరీలు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్(4), విరాట్ కోహ్లీ(4) సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. 1970-71లో జరిగిన వెస్టిండిస్ పర్యటనలో గవాస్కర్ ఈ ఘనత సాధించాడు.
2014-15 ఆసీస్ పర్యటనలో కెప్టెన్ విరాట్ కోహ్లీ(4) సెంచరీలు నమోదు చేశాడు. 1970-71 వెస్టిండిస్ పర్యటనలో సర్దేశాయ్(3), 2002 ఇంగ్లాండ్ పర్యటనలో రాహుల్ ద్రవిడ్(3), 2011 ఇంగ్లాండ్ పర్యటనలో ద్రవిడ్ (3), 2018-19 ఆసీస్ పర్యటనలో పుజారా(3) అత్యధిక సెంచరీలు నమోదు చేశారు.