హైదరాబాద్: ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్ను ఆతిథ్య భారత్ తొలి రోజు రెండు స్వర్ణాలు సహా ఏడు పతకాలతో ఘనంగా ఆరంభించింది. మహిళల షాట్పుట్లో గురువారం పుట్టినరోజు జరుపుకున్న మన్ప్రీత్ కౌర్, పురుషుల 5000 మీటర్ల పరుగులో జి.లక్ష్మణన్ స్వర్ణాలతో సత్తా చాటారు.
ఇక స్టార్ డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ కాంస్యంతో బోణీ కొట్టాడు. ఇలా తొలిరోజు భారత అథ్లెట్లు 2 స్వర్ణాలు, ఒక రజతం, 4 కాంస్య (మొత్తం 7) పతకాలు సాధించారు. గురువారం భువనేశ్వర్లోని కళింగ స్టేడియంలో జరిగిన మహిళల షాట్పుట్ విభాగంలో మన్ప్రీత్ గుండును 18.28 మీటర్ల దూరం విసిరి విజేతగా నిలిచింది.

గురువారం మన్ప్రీత్ తన 27వ పుట్టినరోజుని జరుపుకోవడం విశేషం. బంగారు పతకంతో పాటు లండన్లో జరిగే వరల్డ్ చాంపియన్షిప్స్నకు కూడా ఆమె అర్హత సాధించింది. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ గువో టియాన్కియాన్ (17.91 మీటర్లు, చైనా) రన్నరప్తో సరిపెట్టుకోగా, అయా ఒటా (15.45మీటర్లు, జపాన్) మూడోస్థానంలో నిలిచింది.
ఇక పురుషుల 5000 మీటర్ల పరుగులో జి. లక్ష్మణన్ 14:54.48 నిమిషాల టైమింగ్తో పూర్తిచేసి బంగారు పతకం గెలుపొందాడు. దీంతో గురువారం భారత్ ఖాతాలో రెండో స్వర్ణాన్ని చేర్చాడు. దీంతో లండన్ వేదికగా ఆగస్టులో జరుగనున్న వరల్డ్ చాంపియన్షిప్కు అర్హత సాధించాడు.
ఇక మహిళల 5000మీ. పరుగు విభాగంలో సంజీవని జాదవ్ కాంస్యాన్ని గెలుచుకుంది. ఆమె లక్ష్యాన్ని 16ని.0.24 సెకన్లలో పూర్తి చేసింది. మహిళల లాంగ్జంప్లో భారత్కు రెండు పతకాలు లభించాయి. వి. నీనా 6.54 మీటర్లతో రజతం కైవసం చేసుకోగా, నయనా జేమ్స్ 6.42 మీటర్ల దూరంతో కాంస్యం నెగ్గింది. వియత్నాం అథ్లెట్ బుయ్ థైతు (6.54 మీ.) స్వర్ణం గెలిచింది.

మహిళల జావెలిన్ త్రోలో అనురాణి 57.32 మీటర్ల దూరం జావెలిన్ విసిరి మూడో స్థానంతో భారత్ ఖాతాలో మరో కాంస్యం చేర్చింది. పురుషుల డిస్కస్ త్రో హ్యాట్రిక్ స్వర్ణంపై గురిపెట్టిన స్టార్ అథ్లెట్ వికాస్ గౌడ 60.81మీ. దూరం విసిరి మూడో స్థానంలో నిలిచాడు. దీంతో ఈసారి కంచుతోనే సరిపెట్టాడు.