ఆసియా క్రీడల్లో పాకిస్థాన్ కు ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారీ షాక్ ఇచ్చింది. ఈ రోజు(శుక్రవారం) జరిగిన 2023 ఆసియా గేమ్స్ సెమీ ఫైనల్లో పాకిస్థాన్ పై 4 వికెట్ల తేడాతో గెలుపొంది చరిత్ర సృష్టించింది. అంతే కాదు పాక్ ను చిత్తుగా ఓడించిన ఆఫ్ఘన్.. నేరుగా ఫైనల్ చేరింది. ఇక భారత్ ఇప్పటికే ఫైనల్ చేరడంతో రేపు జరగబోయే మ్యాచ్ ఈ రెండు జట్ల మధ్యే జరగనుంది.
ఇక ఈ రోజు జరిగిన పాక్, ఆఫ్ఘన్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే.. మొదట టాస్ గీచిన ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన పాక్.. 18 ఓవర్లలో 115 రన్స్ చేసి ఆల్ ఔట్ అయింది. పాక్ తరపున ఒమర్ యూనిస్(24) టాప్ స్కోరర్ కాగా.. ఆఫ్ఘన్ బౌలర్లలో ఫరీద్ అహ్మద్ 3 వికెట్లు, కయీస్ అహ్మద్ 2 వికెట్లు తీశారు.

తర్వాత 116 టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘన్.. మొదట్లో తడబడినా మిడిలార్డర్ లో నూర్ అలీ 33 బంతుల్లో 39 రన్స్ చేసి ఇన్నింగ్స్ ని నిలబెట్టగా.. చివర్లో గుల్బదిన్ నైబ్ (26) బౌండరీల మోత మోగించి జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో ఆఫ్ఘన్ జట్టు కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచ్ లో గెలిచి ఫైనల్ లో అడుగుపెట్టింది. పాక్ బౌలర్లలో అరాఫత్ మిన్హాస్, ఉస్మాన్ ఖాదిర్ చెరో 2 వికెట్లు తీశారు.
ఇదిలా ఉంటే ఈరోజే జరిగిన మరో సెమీ ఫైనల్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను చిత్తుగా ఓడించిన టీమిండియా నేరుగా ఫైనల్ చేరింది. మొదట టాస్ గెలిచిన భారత్.. బంగ్లాదేశ్ కు బ్యాటింగ్ అప్పగించింది. భారత బౌలర్లు విజృంభించడంతో బంగ్లా బ్యాటర్లు ఒక్కరు కూడా క్రీజులో నిలబడలేకపోయారు. భారత బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 96 రన్స్ చేశారు. ఇక 97 టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా 9.2 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. దీంతో నేరుగా ఫైనల్ చేరింది.
కాగా శనివారం ఉదయం 11 గంటలకు భారత్, ఆఫ్ఘన్ జట్లు ఫైనల్లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టుకు బంగారు పతకం, ఓడిన జట్టుకు కాంస్య పతకం దక్కుతాయి. ఇక ఈ మ్యాచ్ తో పాటు ఉదయం 6 గంటలకు పాక్, బంగ్లా జట్ల మధ్య ప్లే-ఆఫ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టుకు రజత పతకం దక్కుతుంది.