కరాచీ: ఆసియా కప్ 2020 టోర్నీని సెప్టెంబర్ లేదా అక్టోబర్లో కచ్చితంగా నిర్వహిస్తాం అని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సీఈవో వసీం ఖాన్ స్పష్టం చేసారు. టోర్నీని శ్రీలంక లేదా యూఏఈలో నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆస్ట్రేలియా గడ్డపై వచ్చే అక్టోబర్లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ నిర్వహణపై స్పష్టత లేకపోవడంతో.. ఆ స్థానంలో ఆసియా కప్ను నిర్వహించానుకుంటున్నట్లు వసీం ఖాన్ తెలిపాడు. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020పై స్పందించకపోవడం విశేషం.
కరాచీలో జరిగిన మీడియా సమావేశంలో పీసీబీ సీఈవో వసీం ఖాన్ మాట్లాడుతూ... 'ఆసియా కప్ ముందుకు సాగుతుంది. పాకిస్తాన్ జట్టు సెప్టెంబర్ 2న ఇంగ్లండ్ పర్యటనను ముగించుకొని స్వదేశానికి రానుంది. దీంతో ఆసియా కప్ను సెప్టెంబర్ లేదా అక్టోబర్లో నిర్వహించాలనుకుంటున్నాం. కరోనా వైరస్ కేసులు తక్కువగా నమోదవుతున్న శ్రీలంకలో నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నాం. ఒకవేళ లంక బోర్డు ఒప్పుకోకుంటే.. టోర్నీని యూఏఈలో నిర్వహించడానికి కూడా సిద్ధం' అని అన్నారు.
అక్టోబర్లో టీ20 ప్రపంచకప్ జరిగే అవకాశాలు లేకుంటే.. ఆ సమయంలో పాక్ జట్టు ఇతర దేశాలతో సిరీస్లు ఆడే విధంగా ప్రణాళిక నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే సెస్టెంబర్, అక్టోబర్లో ఆసియా కప్.. డిసెంబర్లో న్యూజిలాండ్తో హోం సిరీస్.. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో రెండు టెస్టులు, టీ20లు ఆడేలా ప్రణాళిక రూపొందించాం. నవంబర్ నెలలో పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో మిగిలిన మ్యాచ్లను నిర్వహిస్తాం' అని వసీం ఖాన్ తెలిపారు.
ఐపీఎల్ 2020 కోసం తాము ఆసియా కప్ను వదులుకోమని పీసీబీ ఇదివరకే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇంతకుముందే ప్రకటించిన ఆసియా కప్ షెడ్యూల్ కూడా సెప్టెంబర్లోనే ఉండడంతో పీసీబీ ఐపీఎల్-13 నిర్వహణపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఐపీఎల్ కోసం తమ టోర్నీని ఎలా వాయిదా వేసుకుంటామని ప్రశ్నించింది. 'షెడ్యూల్ ప్రకారం కాకుండా ఆసియా కప్ జరిగేలా చర్చలు సాగుతున్నాయని విన్నాం. కానీ అది సాధ్యం కాదు. కేవలం ఒక్క దేశం కోసం ఈ టోర్నీని ముందుకు జరపడం సరికాదు. ఐపీఎల్ కోసం మేం వెనక్కితగ్గం. ప్రేక్షకులు లేకుండా టీ20 ప్రపంచకప్ కూడా జరిగే అవకాశం ఉంది. లేకపోతే ప్రతీ జట్టు 15 నుంచి 20 మిలియన్ డాలర్లు నష్టపోతుంది' అని వసీం ఖాన్ స్పష్టం చేశారు.
కళ్లద్దాలు పెట్టుకున్న ఆ అమ్మాయి బాగా నచ్చింది.. ఆమెతో డేట్కు వెళతా: గంగూలీ