మిర్పూర్: ఆసియా కప్లో ఆతిథ్య బంగ్లాదేశ్ శ్రీలంకపై సంచలన విజయం సాధించింది. డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంకకు బంగ్లాదేశ్ భారీ షాక్ తగిలింది. ఆదివారం జరిగిన రౌండ్ రాబిన లీగ్ మ్యాచలో ఆల్రౌండ్ నైపుణ్యంతో అదరగొట్టిన బంగ్లా 23 పరుగుల తేడాతో లంకపై గెలిచింది.
షబ్బీర్ రహ్మాన్ (54 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 80) అర్ధ సెంచరీతో రాణించడంతో.. తొలుత బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. షకీబల్ హసన్ (32), మహ్మదుల్లా (23 నాటౌట్) కీలకమైన పరుగులు సాధించారు. దుష్మంత చమీర 3 వికెట్లు పడగొట్టగా మాథ్యూస్, కులశేఖర చెరో వికెట్ తీశారు.
ఆ తర్వాత లక్ష్య ఛేదనలో లంక ఓవర్లన్నీ ఆడి 8 వికెట్లు కోల్పోయి 124 పరుగులే చేయగలిగింది. దినేష్ చండీమల్ (37), షెహాన జయసూర్య (26) మినహా మిగతా బ్యాట్స్మెన విఫలమయ్యారు. అల్ అమిన్ హుస్సేన 3, షకీబల్ 2 వికెట్లు తీశారు. ముస్తాఫిజుర్, మోర్తజా, మహ్మదుల్లా తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్లో ఓడినా లంక ఫైనల్ బెర్త్ అవకాశాలు సజీవంగా ఉంచుకుంది. లంక ఇంకా రెండు మ్యాచలు ఆడాల్సి ఉంది. షబ్బీర్ రహ్మాన 'మ్యాన ఆఫ్ ద మ్యాచ'గా నిలిచాడు.

లక్ష్యఛేదనలో శ్రీలంక బ్యాట్స్మెన్ తడబాటుకు గురయ్యారు. బంగ్లా ఫీల్డింగ్ వైఫల్యంతో తొలి ఓవర్లోనే ఓపెనర్ చండీమల్కు లైఫ్ లభించింది. చండీమల్ క్యాచ్ను సెకండ్ స్లిప్లో సౌమ్య సర్కార్ నేలపాలు చేశాడు. తర్వాత దిల్షాన్ కూడా క్యాచ్ అవుటయ్యే ప్రమాదం తప్పించుకున్నాడు. కానీ, ఈ అవకాశాన్ని దిల్షాన సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మూడో ఓవర్లో రెండు బౌండ్రీలు బాదిన దిల్షాన్ అదే జోరులో మరో భారీ షాట్కు ప్రయత్నించి అవుటయ్యాడు.
తర్వాత క్రీజులోకొచ్చిన షెహాన జయసూర్య ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఐదో ఓవర్లో జయసూర్య సిక్సర్ కొట్టగా చండీమల్ ఫోర్ బాదాడు. ఏడో ఓవర్ నుంచి బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో షెహాన-చండీమల్ భారీ షాట్లు ఆడలేకపోయారు. దీంతో స్కోరు బోర్డు వేగం తగ్గింది. చివరికి చండీమల్ను మహ్మదుల్లా అవుట్ చేశాడు. స్వల్ప తేడాతో జయసూర్య కూడా స్టంపౌటయ్యాడు.
చివరగా ఇలా..
ఆఖరులో విజయానికి లంక 48 బంతుల్లో 69 పరుగులు చేయాల్సి వచ్చింది. ఈ దశలో బంగ్లా పేసర్ అల్ అమిన హుస్సేన్ విజృంభణతో లంక మిడిలార్డర్ కకావికలమైంది. తిసార పెరీర (4), మిలింద సిరివర్దన (3) స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరుకున్నారు.
కెప్టెన్ మాథ్యూస్ (12) కూడా జట్టును ఆదుకోలేకపోయాడు. ఇక 19వ ఓవర్లో ముస్తాఫిజుర్ పొదుపుగా బౌలింగ్ చేసి కేవలం 5 పరుగులే ఇచ్చాడు. విజయానికి ఆఖరి ఓవర్లో లంక 32 పరుగులు చేయాల్సి ఉండగా 2 వికెట్లు కోల్పోయి 10 పరుగులే చేయగలిగింది.
బంగ్లా మొదట్లో ఇలా...
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన బంగ్లాకు శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఓపెనర్ మహ్మద్ మిథున (0)ను మాథ్యూస్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు. స్వల్ప తేడాతో మరో ఓపెనర్ సౌమ్య సర్కార్ (0) కూడా డకౌటయ్యాడు. తర్వాత క్రీజులోకొచ్చిన ముష్ఫికర్ రహీమ్ (4) సింగిల్ డిజిట్కే అవుటయ్యాడు.
టాప్ ఆర్డర్ వైఫల్యంతో...
టాపార్డర్ వైఫల్యంతో బంగ్లా 26 పరుగులకే మూడు ప్రధాన వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో షబ్బీర్ రహ్మాన్, ఆల్ రౌండర్ షకీబల్ నాలుగో వికెట్కు 82 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకున్నారు. లంక బౌలర్లను వీరిద్దరూ దీటుగా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో రెహ్మాన 38 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో వేగంగా హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మరో ఎండ్లో షకీబల్ కూడా దూకుడుగా ఆడాడు. చివరికి షబ్బీర్ను చమీర వెనక్కి పంపాడు.