సూపర్ ఫామ్లో శిఖర్ ధావన్
హాంకాంగ్పై చేసిన సెంచరీ ధావన్కు తన వన్డే కెరీర్లో 14వ సెంచరీ కావడం విశేషం. అయితే, ఆసియాకప్కు ముందు జరిగిన ఇంగ్లాండ్ పర్యటనలో మాత్రం ధావన్ ప్రదర్శనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ఆసియా కప్లో ధావన్ తిరిగా ఫూర్వ వైభవాన్ని అందుకోవడంతో అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
నా ప్రదర్శనపై నేనే సమీక్షించుకుంటా
ఈ క్రమంలో ధావన్ మాట్లాడుతూ "మ్యాచ్ అయిపోయిన ప్రతిసారి నా ప్రదర్శనపై నేనే సమీక్షించుకుంటాను. పేలవంగా అనిపించిన ప్రతిసారి దాన్ని అధిగమించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాను. ఆసియాకప్ విషయంలోనూ అదే జరిగింది. ఇంగ్లాండ్ పర్యటనలో నేను బ్యాటింగ్ బాగానే చేశాను. కానీ, పరుగులు చేయలేకపోయాను" అని అన్నాడు.
ప్రస్తుతం ఫామ్లో లేనని చాలామంది అన్నారు
"నేను ప్రస్తుతం ఫామ్లో లేనని చాలామంది అన్నారు. నేను ఫామ్లో లేకుండా ఎప్పుడూ లేను. నా అభిమానులే నా విమర్శకులు. గత నాలుగేళ్ల కాలంలో ఎన్నో మ్యాచ్లు ఆడాం. కొన్ని గెలిచాం. కొన్ని ఓడిపోయాం. మనం మనుషులం. ఆందోళన పడితే ఏదీ సాధించలేం. గెలుపు ఎంత ఊతమిస్తుందో ఓటమి కూడా అన్నే పాఠాలు నేర్పుతుంది" అని ధావన్ చెప్పుకొచ్చాడు.
అందుకు ఉదాహరణ అంబటి రాయుడే
"అంబటి రాయుడినే ఉదాహరణగా తీసుకుంటే చాలాకాలం తర్వాత జట్టులోకి వచ్చిన అతడు చాలా బాగా రాణిస్తున్నాడు. హాంకాంగ్ మ్యాచ్లోనూ మంచి ప్రదర్శన చేశాడు. పాక్తో మ్యాచ్లోనూ మెరుగైన ముగింపు ఇచ్చాడు. అలాగని అతడు ఇంతకు ముందు ఫామ్లో లేనట్లు కాదు కదా. ఏదేమైనా ఇప్పుడు టీమిండియాలోని ఆటగాళ్లందరూ మంచి ఫామ్లో ఉన్నారు" అని ధావన్ అన్నాడు.