అభిమానులంతా ఆత్రుతగా ఎదురు చూసిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ తేలిపోయింది. టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ నిప్పులు చెరగడంతో శ్రీలంక కేవలం 50 పరుగులకే ఆలౌట్ అయింది. సిరాజ్ ఏకంగా ఆరు వికెట్లతో రెచ్చిపోయాడు. దీంతో కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో శ్రీలంక అభిమానులకు ఏడుపొక్కటే తక్కువైంది.
ఈ మ్యాచులో సిరాజ్తో పాటు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య కూడా ఆకట్టుకున్నాడు. కేవలం 2.2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన అతను మూడు పరుగులిచ్చి, మూడు వికెట్లు తీసుకున్నాడు. శ్రీలంక చివరి ఇద్దరు బ్యాటర్లను పాండ్యానే అవుట్ చేశాడు. ఈ క్రమంలో 9వ వికెట్ తీసినప్పుడు కోహ్లీ సెలబ్రేషన్ నెట్టింట వైరల్గా మారింది.

మామూలుగా వికెట్లు పోయినప్పుడు కోహ్లీ చాలా వైల్డ్గా సెలబ్రేట్ చేసుకుంటాడు. కానీ ఈ మ్యాచులో మాత్రం క్యాచ్ అందుకున్న తర్వాత కామ్గా అక్కడే పడుకొని కళ్లు మూసుకున్నాడు. ఈ 'స్లీపింగ్ సెలబ్రేషన్' ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన శ్రీలంక ఇన్నింగ్స్ 16వ ఓవర్లో జరిగింది. ఆ ఓవర్ తొలి బంతికి లంక టెయిలెండ్ ప్రమోద్ మదుషన్ తడబడ్డాడు.
దీంతో ఎడ్జ్ తీసుకున్న బంతి.. ఫస్ట్ స్లిప్లో ఉన్న విరాట్ కోహ్లీ వైపు దూసుకొచ్చింది. దాన్ని చటుక్కున పట్టేసుకున్న కోహ్లీ ఎప్పట్లా ఎగిరి గంతులు వేయకుండా అలాగే నేలపై పడుకొని వింతగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ మరుసటి బంతికే ఇషాన్ కిషన్కు క్యాచ్ ఇచ్చిన పతిరాణా కూడా పెవిలియన్ చేరడంతో 50 పరుగులకే శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసింది.
ఇక ఛేజింగ్లో శుభ్మన్ గిల్ (27 నాటౌట్), ఇషాన్ కిషన్ (23 నాటౌట్) ఇద్దరూ వేగంగా ఆడి కేవలం 6.1 ఓవర్లలోనే మ్యాచ్ ముగించారు. దీంతో మరో 263 బంతులు మిగిలుండగానే భారత్ ఈ మ్యాచ్ గెలిచింది. ఇలా మిగిలిన బంతుల పరంగా భారత్కు ఇదే అతిపెద్ద విజయం కావడం గమనార్హం.