Asia Cup 2025: ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో తొలిసారిగా భారత్, పాకిస్తాన్ జట్లు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో తలపడనున్నాయి. ఈ చారిత్రక ఘట్టాన్ని వీక్షించడానికి అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో ఆసియా కప్ 2025 ఫైనల్ పోరులో భారత జట్టు టైటిల్ను గెలుచుకునేందుకు హాట్ ఫేవరెట్ అని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ పాకిస్తాన్ జట్టు ఇటీవల బంగ్లాదేశ్పై తక్కువ స్కోరును కాపాడుకుని విజయం సాధించడం ద్వారా పొందిన ఆత్మవిశ్వాసం, మంచి ఊపును ఫైనల్లో కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు.
"ఇది భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్, ఆదివారం కూడా పాకిస్తాన్ బౌలింగ్ ప్రభావం చూపుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ మ్యాచ్లో కూడా కచ్చితంగా భారత్ గెలుపునకు ఫేవరెట్" అని అక్రమ్ మీడియా ప్రతినిధులతో అన్నారు. అయినప్పటికీ, ఈ ఫార్మాట్లో(టీ20)ఏదైనా జరగవచ్చు అని, ఒక మంచి ఇన్నింగ్స్ లేదా ఒక అద్భుతమైన స్పెల్ మ్యాచ్ రూపురేఖలను మార్చేయగలదని ఆయన గుర్తుచేశారు.

పాకిస్తాన్కు అక్రమ్ సలహా
పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఈ ఆత్మవిశ్వాసాన్ని కొనసాగించి, తెలివిగా ఆడాలని అక్రమ్ సూచించారు. ముఖ్యంగా భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ వికెట్లను మ్యాచ్ ఆరంభంలోనే తీయగలిగితే, అది టీమిండియాపై ఒత్తిడి పెంచుతుందని ఆయన అన్నారు. సూపర్ 4 మ్యాచ్లో భారత్తో జరిగిన మ్యాచ్లో గిల్, అభిషేక్ 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన విషయాన్ని అక్రమ్ ప్రస్తావించారు. "ప్రారంభ ఓవర్లలో కొన్ని వికెట్లు ముఖ్యంగా అభిషేక్, గిల్ వికెట్లు పడితే, అది ఖచ్చితంగా భారత్పై ఒత్తిడి తెస్తుంది. ఇది రసవత్తరమైన పోటీ అవుతుందని నేను ఆశిస్తున్నాను. చివరికి ఉత్తమ జట్టు గెలవాలని కోరుకుంటున్నాను," అని అక్రమ్ అన్నారు. ఆసియా కప్ 41 ఏళ్ల చరిత్రలో భారత్, పాకిస్తాన్ ఫైనల్లో తలపడటం ఇదే మొదటిసారి. మరి ఏ జట్టు గెలుస్తుందో వేచి చూడాల్సిందే.