Asia Cup 2025: పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్తాన్ జట్లు ఆసియా కప్లో తలపడినప్పటి నుంచి వివాదాలు ఆగడం లేదు. సెప్టెంబర్ 14న టీమిండియా ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో చేతులు కలపకపోవడంపై పాకిస్తాన్ మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత సెప్టెంబర్ 21న జరిగిన సూపర్-4 మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాళ్లు హద్దులు మీరి ప్రవర్తించారని ఆరోపణలు వచ్చాయి.
భారత్ తో జరిగిన సూపర్-4 మ్యాచ్లో పాక్ ఓపెన్ సాహిబ్జాదా ఫర్హాన్ తన అర్థ సెంచరీ పూర్తయిన తర్వాత 'గన్ సెలబ్రేషన్' చేశారు. అంతే కాకుండా బౌండరీ వద్ద భారత అభిమానులు విరాట్ కోహ్లీ పేరుతో ఆట పట్టిస్తుండగా.. హారిస్ రౌఫ్ 'రఫేల్'ను కూల్చివేస్తున్నట్లు సైగలు చేశారు. అలాగే తన చేతితో '6-0' అని చూపించారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు తమ చర్యలతో భారత అభిమానులను, ఆటగాళ్లను రెచ్చగొట్టడానికి ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి.

ఈ ఘటనలపై బీసీసీఐ తీవ్రంగా స్పందించింది. ఈ ఇద్దరు పాకిస్తాన్ ఆటగాళ్లపై బీసీసీఐ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్కు ఫిర్యాదు చేసింది. వారి రెచ్చగొట్టే చర్యలకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలని బీసీసీఐ డిమాండ్ చేసింది. అలాగే అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్లతో హారిస్ రౌఫ్ ఘర్షణకు దిగడం పట్ల కూడా బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది.
బీసీసీఐ ప్రకారం.. పాక్ ఆటగాళ్లు కావాలనే ఇలా ప్రవర్తించారు. అయితే సాహిబ్జాదా ఫర్హాన్ మ్యాచ్ తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో తన గన్ సెలబ్రేషన్ గురించి మాట్లాడుతూ.. దానికి పశ్చాత్తాపం లేదని స్పష్టం చేశారు. ఈ ఫిర్యాదుపై మ్యాచ్ రిఫరీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.