
దుబాయి:దుబాయి: ఆసియా కప్లో భాగంగా తలపడుతోన్న ఫైనల్ మ్యాచ్లో బంగ్లా బ్యాట్స్మెన్ శాయశక్తులా పోరాడారు. స్వల్ప స్కోరుకే ఆలౌటైయ్యారు. 48.3 ఓవర్లు పూర్తయ్యేసరికి పది వికెట్లు కోల్పోయి 222 పరుగులు పూర్తి చేసింది. ఓపెనర్ లిటన్ దాస్(121) 117 బంతుల్లో 12ఫోర్లు, 2సిక్సర్లు) సెంచరీతో మెరుపులు మెరిపించడంతో 48.3 ఓవర్లలో బంగ్లా 222 పరుగులు మాత్రమే చేసింది.
బంగ్లాదేశ్ చేసిన స్కోరులో లిటన్దాస్ ఒంటరిపోరాటంతో దాదాపు సగం స్కోరు చేయగలిగాడు. మరో ఓపెనర్ మెహిదీ హసన్(32), సౌమ్య సర్కార్(33) మాత్రమే రాణించారు. మిగతా బ్యాట్స్మెన్ ఘోరంగా విఫలమయ్యారు. అనవసరపు షాట్లు ఆడటం.. పరిస్థితులకు తగ్గట్లుగా నిలకడగా బ్యాటింగ్ చేయడంలో విఫలమవడంతో సులువుగా వికెట్లు చేజార్చుకున్నారు. వారిలో కొందరైతే కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు.
ఆరంభంలో ఓపెనర్ల దూకుడు చూస్తే బంగ్లా భారీ స్కోరు చేసేలా కనిపించింది. 20 ఓవర్ల వరకు ఓపెనర్లిద్దరూ వికెట్ పోకుండా జాగ్రత్తగా ఆడి రన్రేట్ 6కు తగ్గకుండా పరుగులు రాబట్టి మంచి శుభారంభం అందించారు. అయితే అదే జోరు ఆఖరి వరకు కొనసాగించడంలో చేతులెత్తేశారు. తొలి వికెట్కు బంగ్లా స్కోరు 120(20.5ఓవర్లలో). హసన్ ఔటవడంతో తరువాత వచ్చిన బ్యాట్స్మెన్ క్రమం తప్పకుండా పెవిలియన్ బాట పట్టారు. భారత బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్తో తెలివిగా బంతులేయడంతో.. అనవసర తప్పిదాలతో బంగ్లా మూల్యం చెల్లించుకుంది.
లిటన్ పోరాడుతున్నా.. మరో ఎండ్లో క్రీజులో నిలబడి అతనికి సహకరిస్తూ భాగస్వామ్యం నెలకొల్పే ప్రయత్నం చేయలేదు. మరోవైపు వికెట్ల వేటలో ఉన్న రోహిత్ సేన వచ్చిన అన్ని అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకుంది. మహేంద్రసింగ్ ధోనీ రెండు స్టంపౌట్లు చేసి కీలక ఆటగాళ్లను వెనక్కి పంపాడు. లిటన్ దాస్ వికెట్ ఒకటి. కేదార్ జాదవ్(2) వికెట్ల ఖాతా తెరవగా.. కుల్దీప్ యాదవ్(3) బంగ్లాను భారీ దెబ్బకొట్టారు. బుమ్రా, చాహల్ చెరో వికెట్ తీసి ఫర్వాలేదనిపించారు.