Asia Cup 2026: భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి ప్రతిస్పందనగా భారత్ 'ఆపరేషన్ సింధూర్' ద్వారా పాకిస్థాన్కు తగిన సమాధానం ఇచ్చింది. యుద్ధం ముగిసినప్పటికీ ఇరు దేశాల మధ్య సంబంధాలు మాత్రం మెరుగుపడలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్(WCL) టోర్నమెంట్లో భారత జట్టు పాకిస్థాన్తో లీగ్, సెమీ-ఫైనల్ మ్యాచ్లు ఆడటానికి నిరాకరించింది. ఈ పరిణామాల కారణంగా త్వరలో జరగబోయే ఆసియా కప్ 2025లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుందా లేదా అనే దానిపై సందేహాలు మొదలయ్యాయి.
నిర్వాహకుల స్పందన.. వివరణ
టోర్నమెంట్ ప్రారంభానికి నెల కన్నా తక్కువ సమయం ఉన్నందున ఈ విషయంపై ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు(ECB) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుభాన్ అహ్మద్ స్పందించారు. ఆసియా కప్లో భారత్, పాకిస్థాన్ తలపడకుండా ఉండటం అనేది అసాధ్యమని ఆయన సూచించారు. సుభాన్ అహ్మద్ మాట్లాడుతూ.."నేను అధికారికంగా హామీ ఇవ్వలేకపోవచ్చు. కానీ భారత్, పాకిస్థాన్ మ్యాచ్లు రద్దయ్యే ప్రమాదం కనిపించడం లేదు. ఆసియా కప్ అనేది వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్(WCL) వంటి ప్రైవేట్ టోర్నమెంట్ల మాదిరిగా కాదు. డబ్ల్యూసీఎల్లో భారత్ పాకిస్థాన్తో మ్యాచ్లు ఆడటానికి నిరాకరించింది" అని ఆయన తెలిపారు. ఈ వ్యాఖ్యలు రెండు దేశాల అభిమానులలో కొంత ఊరటనిచ్చాయి.

ఆసియా కప్ 2025 టోర్నమెంట్ వివరాలు ఇలా..
ఈ సారి 2025 పురుషుల టీ20 ఆసియా కప్కు దుబాయ్, అబుదాబి నగరాలు అధికారికంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు జరగనుంది. దుబాయ్ మొత్తం 11 మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వనుండగా.. ఇందులో ఫైనల్ కూడా ఉంటుంది. అబుదాబిలో 8 మ్యాచ్లు జరుగుతాయి. భారత్ తన గ్రూప్-ఏ మ్యాచ్లను సెప్టెంబర్ 10న యూఏఈతో, సెప్టెంబర్ 14న పాకిస్థాన్తో దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆడనుంది. ఆ తర్వాత ఓమన్తో జరిగే మ్యాచ్ సెప్టెంబర్ 19న అబుదాబిలోని షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియంలో ఉంటుంది. గ్రూప్ దశ దాటిని తర్వాత భారత్, పాకిస్థాన్ సూపర్ 4, ఫైనల్లో కూడా తలపడే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.