Asia Cup 2025: ఆసియా కప్ 2025 రాబోతోంది. టీ20 క్రికెట్ను ఆల్రౌండర్ల ఆటగా పిలుస్తారు. ఒక జట్టులో ఎంతమంది ఆల్రౌండర్లు ఉంటే ఆ జట్టు అంత మెరుగ్గా ఉంటుందని చెబుతారు. రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత హార్దిక్ పాండ్యా టీమిండియాలో ముఖ్యమమైన ఆల్రౌండర్ పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఐపీఎల్లో అద్భుత ప్రదర్శనతో తమ సత్తా చాటుకున్న ఇతర ఆల్రౌండర్లు కూడా ఉన్నారు. అయితే టీమిండియాలో చోటు దక్కించుకునే ఆల్రౌండర్ల గురించి తెలుసుకుందాం.
హార్దిక్ పాండ్యా
హార్దిక్ పాండ్యా టెస్ట్ జట్టులో లేకపోవచ్చు, కానీ వన్డే, టీ20 ఫార్మాట్లలో తనను తాను నిరూపించుకున్నాడు. ఈ రెండు ఫార్మాట్లలో పాండ్యా నిలకడగా ఆడుతున్నాడు. టీ20 ప్రపంచ కప్ గెలవడంలో ఫైనల్లో కీలక పాత్ర పోషించాడు. కాబట్టి ఆల్రౌండర్లలో పాండ్యా మొదటి ఎంపికగా ఉంటాడు. గత ఐపీఎల్ సీజన్లో హార్దిక్ పాండ్యా 15 మ్యాచ్లలో 224 పరుగులు చేశాడు. ఇందులో అజేయంగా 48 పరుగులు పాండ్యా బెస్ట్ స్కోర్. బౌలింగ్లో 15 మ్యాచ్లలో 14 వికెట్లు తీసుకున్నాడు. 36 పరుగులకు ఐదు వికెట్లు అతని అత్యుత్తమ ప్రదర్శన. హార్దిక్ జట్టు సమతౌల్యంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. హార్దిక్ పాండ్యా హార్డ్ హిట్టింగ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టడం సాధారణమే.

నితీష్ కుమార్ రెడ్డి
నితీష్ కుమార్ రెడ్డి గత రెండు సీజన్లలో ఆడి భారత జట్టులో కీలక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆస్ట్రేలియాలో తన మొదటి విదేశీ పర్యటనలో టెస్టులో సెంచరీ చేసి తన సత్తా చాటాడు. అయితే గత ఐపీఎల్ సీజన్ అతనికి అంతగా కలిసిరాలేదు. నితీష్ కుమార్ రెడ్డి 13 మ్యాచ్లలో కేవలం 182 పరుగులు మాత్రమే చేశాడు. అతని అత్యుత్తమ స్కోర్ 32 పరుగులు. బౌలింగ్లో కూడా 13 మ్యాచ్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే తీశాడు. నితీష్ దూకుడు బ్యాటింగ్ భారత జట్టుకు మిడిలార్డర్లో కీలక పరుగులు అందించగలదు. కానీ టెస్టుల మాదిరిగానే సెలెక్టర్లు అతనిపై నమ్మకం ఉంచుతారో లేదో చూడాలి.
శివమ్ దూబే
శివమ్ దూబే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరిన తర్వాత భారత జట్టులోకి తిరిగి వచ్చాడు. ఈ ఐపీఎల్లో అతనికి బౌలింగ్లో పెద్దగా అవకాశాలు రాలేదు. గత టీ20 సిరీస్లో జట్టులో భాగం కాబట్టి అతని ఎంపిక సహజమే, కానీ నితీష్ కుమార్ రెడ్డి కంటే అతనికి ప్రాధాన్యత ఇస్తారా అనేది చూడాలి. శివమ్ దూబే ఈ ఐపీఎల్లో 14 మ్యాచ్లలో 357 పరుగులు చేశాడు. ఇందులో 50 పరుగులు అతని అత్యధిక స్కోర్. ఈ సీజన్లో అదే అతని ఏకైక అర్ధ సెంచరీ. బౌలింగ్లో ఈ సీజన్ మొత్తం అతను కేవలం 14 బంతులు మాత్రమే వేశాడు. ఈ సీజన్ సీఎస్కేకు కూడా అంతగా కలిసిరాలేదు.
వాషింగ్టన్ సుందర్
రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత వాషింగ్టన్ సుందర్ను ఆయన ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. వాషింగ్టన్ సుందర్ జట్టులో ఉంటాడో లేదో చెప్పడం కష్టం, కానీ జట్టు ఆల్రౌండర్లతో వెళ్లాలని భావిస్తే అతనికి చోటు దక్కే అవకాశం ఉంది. ఇటీవలే ఇంగ్లాండ్ పర్యటనలో అతని ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ తరపున వాషింగ్టన్కు ఎక్కువ మ్యాచ్లు లభించలేదు. బౌలింగ్లో ఆరు మ్యాచ్లలో రెండు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. బ్యాటింగ్లో ఆరు మ్యాచ్లలో 49 పరుగులతో సహా 149 పరుగులు చేశాడు.
అక్షర్ పటేల్
రవీంద్ర జడేజా రిటైర్మెంట్ తర్వాత, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అయినప్పటి నుంచి, అక్షర్ పటేల్ ఏ జట్టులో అయినా చోటు సంపాదించుకోగల ఆటగాడిగా ఎదిగాడు. గత కొన్ని సంవత్సరాలుగా అక్షర్ నిలకడగా రాణిస్తున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్లో అతను 12 మ్యాచ్లలో 263 పరుగులు చేశాడు, అత్యుత్తమ స్కోర్ 43 పరుగులు. బౌలింగ్లో 12 మ్యాచ్లలో ఐదు వికెట్లు తీసుకున్నాడు. స్పిన్కు అనుకూలించే యూఏఈ పిచ్లలో అతను జట్టుకు కీలక పాత్ర పోషించగలడు. టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో విరాట్ కోహ్లీతో అతని భాగస్వామ్యాన్ని ఎవరు మర్చిపోగలరు.