Asia Cup 2025: ఆసియా కప్ 2025లో సూపర్-4 దశకు అర్హత సాధించిన 4 జట్లు ఖరారయ్యాయి. గ్రూప్-ఏ నుంచి భారత్, పాకిస్థాన్ జట్లు ఇప్పటికే సూపర్-4కు అర్హత సాధించగా.. గ్రూప్-బీ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు క్వాలిఫై అయ్యాయి. గురువారం శ్రీలంక, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య అబుదాబిలో అద్భుతంగా రాణించిన శ్రీలంక 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన శ్రీలంక నేరుగా సూపర్-4లోకి దూసుకెళ్లింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ కు దిగిన అఫ్గానిస్తాన్ ఆరంభంలో తడిబడింది. 71 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే చివర్లో రషీద్ ఖాన్, మహ్మద్ నబీల బ్యాటింగ్ తో జట్టు 20 ఓవర్లలో 169 పరుగులు సాధించింది. అనంతరం 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక బ్యాటర్లు అద్భుతం రాణించారు. ముఖ్యంగా కుశాల్ మెండిస్ 52 బంతుల్లో 10 ఫోర్లతో 74 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కుశాల్ పెరీరా(28), కమిందు మెండిస్(34) తమ వంతు సహకారాన్ని అందించారు. ఈ గెలుపుతో శ్రీలంక జట్టు సూపర్-4లోకి అడుగుపెట్టగా.. అఫ్గానిస్తాన్ ఆసియా కప్ నుంచి నిష్క్రమించింది. ఇదే గ్రూప్ నుంచి బంగ్లాదేశ్ రెండో జట్టుగా సూపర్-4కు అర్హత సాధించింది. అఫ్గానిస్తాన్ జట్టుకు ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిన మ్యాచ్. శ్రీలంకను ఓడించి ఉంటే అఫ్గానిస్తాన్ సూపర్-4కు అర్హత సాధించి ఉండేది.

సూపర్-4 దశకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఇదే.
*సెప్టెంబర్ 20: శ్రీలంక vs బంగ్లాదేశ్, దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, రాత్రి 8 గంటలకు (భారత కాలమానం ప్రకారం)
*సెప్టెంబర్ 21: భారత్ vs పాకిస్తాన్, దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, రాత్రి 8 గంటలకు
*సెప్టెంబర్ 23: పాకిస్తాన్ vs శ్రీలంక, అబుదాబి, షేక్ జాయెద్ స్టేడియం, రాత్రి 8 గంటలకు
*సెప్టెంబర్ 24: భారత్ vs బంగ్లాదేశ్, దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, రాత్రి 8 గంటలకు
*సెప్టెంబర్ 25: పాకిస్తాన్ vs బంగ్లాదేశ్, దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, రాత్రి 8 గంటలకు
*సెప్టెంబర్ 27: భారత్ vs శ్రీలంక, దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, రాత్రి 8 గంటలకు
*సెప్టెంబర్ 28: ఆసియా కప్ 2025 ఫైనల్, దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం
సూపర్-4 దశలో భారత్కు మొదటి ప్రత్యర్థి పాకిస్తాన్
ఆసియా కప్ టోర్నమెంట్లో ఇప్పటివరకు టీమిండియా అత్యంత బలమైన జట్టుగా నిలిచింది. టీమిండియా తన మొదటి మ్యాచ్లో యూఏఈని.. రెండో మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా ప్లేయర్లు పాకిస్థాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో వివాదం చోటుచేసుకుంది. దీనిపై పీసీబీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పుడు సెప్టెంబర్ 21న దుబాయ్ స్టేడియంలో ఈ రెండు జచ్లు మరోసారి తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో కూడా భారత్ మరోసారి చరిత్ర పునరావృతం చేయడానికి ప్రయత్నిస్తుంది. భారత్ సూపర్-4లో తమ మొదటి మ్యాచ్ను తన చిరకాల ప్రత్యర్థితోనే ఆడనుంది.