Team India Playing XI: ఆసియా కప్ 2025లో భారత్ తమ తొలి మ్యాచ్ను సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది. ఆసియా కప్ ఫైనల్ ప్లేయింగ్ XI ఏంటో టాస్ సమయంలోనే తెలుస్తుంది. కానీ ప్రస్తుతానికి అందిన సమాచారం ప్రకారం జట్టులో కొన్ని కీలక మార్పులు జరిగే అవకాశం ఉంది. ఆసియా కప్ 2025లో భారత్ ఆడే తొలి మ్యాచ్ లో రింకూ సింగ్, సంజూ శాంసన్ లాంటి మ్యాచ్ విన్నర్లకు ప్లేయింగ్ XIలో చోటు దక్కకపోవచ్చు. ఇప్పుడు మనం టీమిండియా తుది జట్టు ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం.
వైస్ కెప్టెన్గా ఎంపికైన శుభ్మన్ గిల్ ప్లేయింగ్ XIలోకి రావడం వల్ల కేరళ స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ సంజు శాంసన్కు చోటు దక్కకపోవచ్చు. దీనిని సంజు శాంసన్కు అన్యాయం అని చెప్పొచ్చు. ఈ తొలి మ్యాచ్లో అభిషేక్ శర్మ మరో ఓపెనర్గా బరిలోకి దిగనున్నాడు. దీంతో రైట్-లెఫ్ట్ కాంబినేషన్ కూడా బలంగా ఉంటుంది. ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్ అయిన అభిషేక్ శర్మ జట్టుకు అదనపు బలాన్ని ఇవ్వగలడు.

గత కొన్నేళ్లుగా తిలక్ వర్మ మూడో స్థానంలో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఐపీఎల్ 2025లో తిలక్ వర్మ ప్రదర్శన అంత గొప్పగా లేకపోయినా.. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లలో ఇదే స్థానంలో వరుసగా రెండు సెంచరీలు చేశాడు. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో జట్టుకు వెన్నెముకగా ఉంటాడు. అతను జట్టులోని అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడు. అలాగే టాప్, మిడిల్ ఆర్డర్ మధ్య వారధిగా ఉండి జట్టుకు చాలా సహాయంగా నిలవగలడు. టీ20 వరల్డ్ కప్ 2024 తర్వాత అక్షర్ పటేల్ ఐదో స్థానంలో మంచి బ్యాటర్గా స్థిరపడ్డాడు. అక్షర్ పటేల్ 71 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లలో 535 పరుగులు చేసి 71 వికెట్లు తీశాడు.
ఆసియా కప్ 2025లో కొన్ని మ్యాచ్లను ముగించడం అలాగే అదనపు పేస్ బౌలర్గా రాణించడం వంటి కీలక బాధ్యతలు డేరింగ్ క్రికెటర్ హార్దిక్ పాండ్యాపై ఉన్నాయి. ఈ సీనియర్ ఆల్రౌండర్ 114 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లలో 1812 పరుగులు చేసి 94 వికెట్లు పడగొట్టాడు. జితేష్ శర్మ ఇప్పటివరకు భారత్ తరఫున కేవలం తొమ్మిది టీ20 అంతర్జాతీయ మ్యాచ్ లే ఆడాడు. కానీ శుభ్మన్ గిల్ కు బదులుగా సంజు శాంసన్ను జట్టులోకి తీసుకోకపోతే, వికెట్ కీపర్గా అతనే మొదటి ఎంపిక అవుతాడు. ఐపీఎల్ 2025లో తన ఫామ్ను ఫినిషర్గా కొనసాగించాలని జితేష్ శర్మ ఆశిస్తున్నాడు. అతని స్ట్రైక్ రేట్ 176.35, 261 పరుగులు చేశాడు.
టీమిండియాకు ప్రధాన స్పిన్నర్, అలాగే ఆసియా కప్ 2025కి ఎక్స్-ఫ్యాక్టర్ గా కుల్దీప్ యాదవ్ ఉంటాడు. ఐపీఎల్ తర్వాత ఏ అంతర్జాతీయ మ్యాచ్ ఆడనందున, కొన్ని మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు ఇవ్వడానికి కుల్దీప్ ఉత్సాహంగా ఉన్నాడు.టీ20 అంతర్జాతీయ మ్యాచ్లలో ఇండియా తరపున ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అర్ష్దీప్ సింగ్. ఈ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ పవర్ప్లే, అలాగే డెత్ ఓవర్లలో ఆధిపత్యం చెలాయించే తన సామర్థ్యంతో 2024 టీ20 వరల్డ్ కప్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. జస్ప్రీత్ బుమ్రా ఈ టోర్నమెంట్లో భారత బౌలింగ్ను ముందుండి నడిపిస్తాడు. ఫిట్గా ఉంటే జట్టులో బుమ్రా ఉత్తమ బౌలర్. టైటిల్ గెలిచేందుకు భారత్ ఎంతవరకు వెళ్తుందనేది చాలావరకు బుమ్రాపై ఆధారపడి ఉంటుంది.గత కొన్నేళ్లుగా ఐపీఎల్లో నిలకడగా రాణిస్తున్న వరుణ్ చక్రవర్తిని యూఏఈలోని టర్నింగ్ పిచ్లలో ఎదుర్కోవడం ఎవరికీ అంత తేలిక కాదు.