Asia Cup 2025: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2025 క్రికెట్ టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు జరగనుందని అధికారికంగా ప్రకటించబడింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)లో జరుగుతుందని భావిస్తున్నారు. ఏ నగరం ఏ మ్యాచ్లకు ఆతిథ్యం ఇస్తుందనే పూర్తి షెడ్యూల్ ఇంకా వెలువడనప్పటికీ, మ్యాచ్ల సమయాలు మాత్రం ప్రకటించారు. దీని ప్రకారం, భారత్, పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూప్లో చేరాయి. గ్రూప్ దశలోనే తలపడనున్నాయి. ఈ నిర్ణయం భారత క్రికెట్ అభిమానులలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.
అభిమానుల ఆగ్రహానికి కారణం
బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. గత మే నెలలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య తీవ్రమైన యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ సమయంలో ఇరు దేశాల మధ్య పరస్పర దాడులు జరిగాయి. ముఖ్యంగా పాకిస్థాన్ సైనికుల కాల్పుల్లో కాశ్మీర్ సరిహద్దులో 20 మందికి పైగా భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా విషాదం నింపింది.

ఈ ఘటనను ఖండిస్తూ ఇరు దేశాల మధ్య ఇకపై ఎలాంటి క్రికెట్ మ్యాచ్ లు జరగకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇటీవల జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో పాకిస్థాన్తో ఆడటానికి పలువురు ప్రముఖ భారత ఆటగాళ్లు నిరాకరించడంతో ఆ మ్యాచ్ రద్దైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆసియా కప్లో భారత్, పాకిస్థాన్ జట్లు ఒకసారి కాకుండా గరిష్టంగా మూడు సార్లు తలపడే అవకాశం ఏర్పడింది.
బీసీసీఐపై అభిమానుల ప్రశ్నల వర్షం
ఈ పరిణామంపై అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆసియా కప్లో పాకిస్థాన్ జట్టుతో ఆడబోమని భారత్ ఖరాఖండిగా చెప్పి ఉండాల్సిందని లేదా ఆసియా కప్ టోర్నమెంట్ నుంచే భారత్ తప్పుకొని ఉండాల్సిందని అభిమానులు గట్టిగా వాదిస్తున్నారు. "అసలు బీసీసీఐ ఈ టోర్నమెంట్కు ఎందుకు అంగీకరించింది?" అని వారు ప్రశ్నిస్తున్నారు. సైనిక బలగాల ప్రాణాల కంటే డబ్బులే ముఖ్యమా అని పలువురు సోషల్ మీడియాలో బీసీసీఐని నిలదీస్తున్నారు. అంతే కాకుండా.. ఒక వేళ భారత్, పాకిస్థాన్తో తలపడితే, ఇకపై ఏ భారత మ్యాచ్లను చూడబోమని, వాటిని పూర్తిగా బహిష్కరిస్తామని కూడా వారు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.