IND vs PAK: ఆసియా కప్ 2025లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ రెండు దేశాలు తలపడటం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో భారత్-పాక్ మ్యాచ్పై ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ ఓ కీలక ప్రకటన చేశారు.
సెప్టెంబర్ 14న భారత్, పాకిస్థాన్ మధ్య ఆసియా కప్ 2025లో భాగంగా కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. భారత జట్టు ఇప్పటికే టోర్నమెంట్లో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. సెప్టెంబర్ 10న యూఏఈతో జరిగిన మ్యాచ్లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి శుభారంభం చేసింది. అయితే ఈ భారత్-పాకిస్థాన్ మ్యాచ్ను చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ దీనిపై తన అభిప్రాయానని వెల్లడించారు.

భారత్-పాక్ మ్యాచ్పై అరుణ్ ధుమాల్ ఏమన్నారంటే?
అరుణ్ ధుమాల్ మాట్లాడుతూ.. " ఆసియా కప్ కోసం భారత జట్టుకు నా శుభాకాంక్షలు. ద్వైపాక్షిక మ్యాచ్ల విషయంలో పాకిస్తాన్తో ఆడబోమని ప్రభుత్వం తమ వైఖరిని స్పష్టం చేసింది. అయితే ఏసీసీ లేదా ఐసీసీ టోర్నమెంట్లు ఉన్నప్పుడు మనం వాటిలో పాల్గొనాల్సి ఉంటుంది. అందుకే మనం ప్రభుత్వం సలహా మేరకు నడుచుకుంటాం" అని తెలిపారు. అరుణ్ ధుమాల్తో పాటు దేశంలోని అనేక ప్రముఖులు భారత్-పాకిస్థాన్ మ్యాచ్పై తమ స్పందనలు తెలియజేశారు.
ఆసియా కప్లో అత్యంత విజయవంతమైన జట్టు భారత్
ఆసియా కప్ చరిత్రను చూస్తే భారత్ అత్యధిక సార్లు టైటిల్ను గెలుచుకుంది. ఇప్పటివరకు టీమిండియా మొత్తం 8 టైటిళ్లు గెలుచుకోగా.. శ్రీలంక 6 టైటిళ్లతో రెండో స్థానం ఉంది. పాకిస్థాన్ రెండు టైటిళ్లను గెలుచుకుంది. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, యూఏఈ, ఇతర ఆసియా దేశాలు తమ మొదటి ట్రోఫీ కోసం ఎదురుచూస్తున్నాయి. భారత్ 1984, 1988, 1990/91, 1995, 2010, 2016, 2018, 2023లో టైటిళ్లను గెలుచుకుంది. ఆసియా కప్ 2025లో కూడా భారత్ తన టైటిల్ను నిలబెట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. తొలిసారిగా సూర్యకుమార్ యాదవ్ భారత జట్టుకు ఆసియా కప్లో కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్పై భారీ అంచనాలు ఉన్నాయి.