Asia Cup 2025: ఆసియా కప్ 2025లో భాగంగా టీమిండియా తమ తొలి పోరాటానికి సిద్ధమైంది. నేడు యూఏఈతో జరిగే మ్యాచ్లో భారత జట్టు తమ సత్తా చాటాలని చూస్తోంది.ఈ మ్యాచ్ కేవలం ఒక టోర్నమెంట్ ఆరంభం మాత్రమే కాదు. అక్టోబర్ 14న దాయాది జట్టు పాకిస్థాన్తో జరిగే కీలక మ్యాచ్కు ముందు 'డ్రెస్ రిహార్సల్'గా పరిగణించబడుతోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ మొదలవుతుంది.
ప్లేయింగ్ ఎలెవన్ పై సందిగ్ధత
భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియాకు ఈ మ్యాచ్లో తుది జట్టును ఎంపిక చేసుకోవడం పెద్ద సవాలుగా మారింది. జట్టు కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహం ప్రకారం, టీమ్లో ఎక్కువగా ఆల్రౌండర్లను ఆడించాలని చూస్తున్నారు. ఇది జట్టు బ్యాటింగ్కు మరింత లాభాన్ని చేకూరుస్తుందని ఆయన అభిప్రాయం. శుభ్మన్ గిల్ తిరిగి రావడంతో ఓపెనింగ్ స్థానం కోసం అభిషేక్ శర్మ, సంజు శాంసన్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అభిషేక్ మంచి ఫామ్లో ఉన్నప్పటికీ, గిల్ వంటి సీనియర్ ఆటగాడిని పక్కన పెట్టడం కష్టం. ఒకవేళ సంజును ఓపెనర్గా పంపిస్తే, గిల్ ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడనేది ప్రశ్నార్థకంగా మారింది.

తిలత్ వర్మ మూడో స్థానంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. నాలుగో స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్వయంగా బ్యాటింగ్కు దిగనున్నారు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే వంటి ఆల్రౌండర్లు రానున్నారు. వికెట్ కీపర్గా సంజు శాంసన్ స్థానంలో జితేష్ శర్మకు అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. జితేష్ ఒక మంచి మ్యాచ్ ఫినిషర్, అతను ఏడో స్థానంలో వచ్చి మ్యాచ్ను ముగించగల సామర్థ్యం కలిగి ఉన్నాడు. స్పిన్ డిపార్ట్మెంట్లో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ల మధ్య గట్టి పోటీ ఉంది. ఇటీవల టీ20ల్లో అద్భుతంగా రాణించిన వరుణ్కు, కుల్దీప్పై ప్రాధాన్యత లభించవచ్చని భావిస్తున్నారు.
యూఏఈ జట్టు అంత తేలికగా తీసుకోలేం..
యూఏఈ జట్టులో భారత, పాకిస్తాన్ దేశాలకు చెందిన ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. జట్టు కోచ్ లాల్చంద్ రాజ్పుత్ ప్రకారం, వారి మధ్య మంచి ఐకమత్యం ఉంది. "డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం చాలా బాగుంది. మేము వేర్వేరు దేశాల నుంచి వచ్చామని అనిపించదు, మేము ఒకే జట్టుగా భావిస్తాం" అని ఆయన పేర్కొన్నారు. తమ జట్టు ఆటగాళ్లు భారత స్టార్ ఆటగాళ్ల నుంచి ఎంతో నేర్చుకోవడానికి ఇది ఒక మంచి అవకాశమని, భారత్కు గట్టి పోటీ ఇవ్వడానికి తమ జట్టు సిద్ధంగా ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ టోర్నమెంట్లో భారత్ తమ రెండో మ్యాచ్ను అక్టోబర్ 14న పాకిస్తాన్తో, మూడో మ్యాచ్ను అక్టోబర్ 19న ఒమన్తో ఆడనుంది. యూఏఈతో జరిగే ఈ మ్యాచ్, పాకిస్తాన్తో జరిగే కీలక పోరుకు టీమిండియా ఎంతవరకు సిద్ధంగా ఉందో సూచిస్తుంది.