Asia Cup 2025: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2025 షెడ్యూల్ అధికారికంగా ప్రకటించబడింది. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)లో జరుగుతుంది. ఈ షెడ్యూల్లో అతిపెద్ద విశేషం ఏమిటంటే, చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూప్లో ఉన్నాయి. అంటే గ్రూప్ దశలో కనీసం ఒక మ్యాచ్ అయినా ఈ రెండు జట్ల మధ్య జరుగుతుంది. ఒకవేళ పెద్దగా ఎలాంటి అనూహ్య ఫలితాలు రాకపోతే, ఈ రెండు జట్లు సూపర్ 4 దశలో మరోసారి తలపడే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతే కాదు, ఆసియాలో అత్యంత బలమైన జట్లుగా ఉన్నందున, ఫైనల్లో కూడా ఈ రెండు జట్లు టైటిల్ కోసం పోటీపడే అవకాశాలున్నాయి. ఈ విధంగా క్రికెట్ అభిమానులు ఈ రెండు జట్ల మధ్య మొత్తం మూడు మ్యాచ్లను చూసే అద్భుత అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్లపై మహ్మద్ అజారుద్దీన్ స్పష్టమైన వైఖరి
పహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి తర్వాత దేశవ్యాప్తంగా పాకిస్థాన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నమెంట్లో భారత మాజీ ఆటగాళ్లు పాకిస్థాన్తో ఆడటానికి నిరాకరించడంతో, వారి మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. అయితే అంతర్జాతీయ స్థాయిలో మాత్రం భారత్, పాకిస్థాన్ జట్లు ఒకదానితో ఒకటి తలపడటానికి సిద్ధంగా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఆసియా కప్లో భారత క్రికెట్ జట్టు, పాకిస్థాన్ జట్టు ఒకే గ్రూప్లో చేరడంపై టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ను మీడియా ప్రశ్నించింది. దానికి ఆయన ఇలా సమాధానం ఇచ్చారు. "ఇది ఆసియన్ క్రికెట్ కౌన్సిల్(ACC) టోర్నమెంట్, కాబట్టి నేను దీనిపై నేరుగా ఏమీ చెప్పలేను. కానీ నేను ఎప్పుడూ చెప్పేది ఒకటే.. ఒకవేళ ఏమైనా జరగాలంటే అన్నీ జరగాలి, లేదంటే ఏమీ జరగకూడదు. మీరు ద్వైపాక్షిక సిరీస్లు ఆడకపోతే, అంతర్జాతీయ ఈవెంట్లలో కూడా ఆడకూడదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. అయితే ప్రభుత్వం, క్రికెట్ బోర్డు ఏ నిర్ణయం తీసుకుంటే అది అంతిమం అవుతుంది." అని అజారుద్దీన్ పేర్కొన్నారు.
డబ్ల్యూసీఎల్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రద్దుపై అజారుద్దీన్ వివరణ
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్లో భారత్, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు కావడంపై కూడా అజారుద్దీన్ తన వ్యాఖ్యలు చేశారు. "ఇది బోర్డుకు సంబంధించిన విషయం. ఎందుకంటే ఈ లెజెండ్స్ టోర్నమెంట్ అధికారమైనది కాదు. ఇది ఐసీసీ(అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) లేదా ఏసీసీ (ఆసియన్ క్రికెట్ కౌన్సిల్) ఆధ్వర్యంలో జరిగే టోర్నమెంట్ కాదు. కానీ ఆసియా కప్ మాత్రం ఏసీసీ, సంబంధిత క్రికెట్ బోర్డుల అధికారిక ఈవెంట్, కాబట్టి దానిపై వారే తుది నిర్ణయం తీసుకుంటారు" అని ఆయన స్పష్టం చేశారు.
ఆసియా కప్ 2025లో భారత్-పాక్ జట్లు 3 సార్లు తలపడే అవకాశం
ఆసియా కప్లో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. వీటిని రెండు గ్రూపులుగా(ప్రతి గ్రూప్లో 4 జట్లు) విభజించారు. గ్రూప్ దశ పూర్తయిన తర్వాత రెండు గ్రూపుల నుంచి టాప్ 2 జట్లు సూపర్ 4 దశకు చేరుకుంటాయి. మిగిలిన జట్లు టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తాయి. భారత్తో పాటు గ్రూప్ ఏలో ఒమన్, యూఏఈ ఉన్నాయి. కాబట్టి భారత్, పాకిస్థాన్ జట్లు సూపర్ 4 దశలో కూడా తలపడే అవకాశాలు ఎక్కువగాఉన్నాయి. ఈ రెండు జట్లు ఆసియాలో బలమైన క్రికెట్ జట్లు కావడంతో ఫైనల్లో కూడా వీటి మధ్య టైటిల్ పోరు జరిగే అవకాశం ఉంది. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28న జరుగుతుంది.
ఆసియా కప్ వేదిక, ఫార్మాట్
ఆసియా కప్ 2025 మ్యాచ్లు యూఏఈలోని అబుదాబి, దుబాయ్ నగరాల్లోని రెండు ప్రధాన వేదికలపై జరుగుతాయి. గతంలో వన్డే ఫార్మాట్లో జరిగిన ఆసియా కప్ను, వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026కు సన్నాహకంగా ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు. మొత్తం 19 మ్యాచ్లు జరగనున్నాయి. వాస్తవానికి ఈ టోర్నమెంట్కు ఆతిథ్య హక్కులు బీసీసీఐకి ఉన్నప్పటికీ, భారత్-పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా టోర్నమెంట్ను తటస్థ వేదిక అయిన యూఏఈకి తరలించారు. ఈ నిర్ణయాన్ని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) జులై 24న ఢాకాలో జరిగిన సమావేశంలో తీసుకుంది.
జట్లు, గ్రూపులు
ఈసారి ఆసియా కప్లో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. వాటిని రెండు గ్రూపులుగా విభజించారు:
గ్రూప్ A: భారతదేశం, పాకిస్థాన్, యూఏఈ, ఒమన్
గ్రూప్ B: శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్
భారత్-పాక్ మ్యాచ్లు
గ్రూప్ దశ: సెప్టెంబర్ 14న భారత్, పాకిస్థాన్ మధ్య హై-వోల్టేజ్ గ్రూప్ దశ మ్యాచ్ జరగనుంది.
సూపర్ 4 దశ: ప్రతి గ్రూప్ నుండి టాప్ 2 జట్లు సూపర్ 4 దశకు అర్హత సాధిస్తాయి. భారత్, పాకిస్థాన్ సూపర్ 4కు అర్హత సాధిస్తే, సెప్టెంబర్ 22న మరోసారి తలపడే అవకాశం ఉంది.
ఫైనల్: రెండు జట్లు సూపర్ 4 నుంచి ఫైనల్కు చేరుకుంటే, సెప్టెంబర్ 28న జరిగే ఫైనల్లో ముచ్చటగా మూడోసారి ఒకదానితో ఒకటి పోటీపడతాయి. ఇది క్రికెట్ అభిమానులకు నిజంగా పండుగే!
టీమిండియా షెడ్యూల్ (గ్రూప్ దశ)
సెప్టెంబర్ 10: భారత్ vs యూఏఈ
సెప్టెంబర్ 14: భారత్ vs పాకిస్థాన్
సెప్టెంబర్ 19: భారత్ vs ఒమన్