ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్తాన్ జట్టుపై భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయం కేవలం వేగవంతమైన బ్యాటింగ్కు నిదర్శనం కాదు.. యువ బ్యాటర్ తిలక్ వర్మ అద్భుతమైన ఆలోచన, సంపూర్ణ నియంత్రణ, సరైన సమయం కోసం వేచి ఉండే నైపుణ్యాన్ని చాటుతుంది. భారత్ 147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే సమయంలో కేవలం 20 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. సరిగ్గా అప్పుడే.. 21 ఏళ్ల తిలక్ వర్మ ప్రశాంత చిత్తంతో క్రీజులోకి వచ్చి.. మరో రెండు బంతులు మిగిలి ఉండగానే భారత్కు విజయాన్ని అందించాడు.
కష్టకాలంలో ఇన్నింగ్స్ను నిలబెట్టిన తీరు
మ్యాచ్ ఆరంభంలోనే భారత్ తమ ముఖ్య ఆటగాళ్లైన అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ , కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వికెట్లను కోల్పోయింది. పాకిస్తాన్ బౌలర్లు దూకుడుగా ఉండటంతో భారత జట్టుపై ఒత్తిడి పెరిగింది. ఇలాంటి క్లిష్ట సమయంలో తిలక్ వర్మ క్రీజులోకి వచ్చి 53 బంతుల్లో 69 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనవసర రిస్క్ తీసుకోకుండా.. ఇన్నింగ్స్ను నిలబెట్టడంపైనే ఆయన దృష్టి పెట్టారు. తిలక్ వర్మ మొదటి సంజు శాంసన్తో కలిసి నెమ్మదిగా ఆడాడు. కానీ పటిష్టమైన 57 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించాడు. సింగిల్స్ తీయడంపై దృష్టి సారించి.. అప్పుడప్పుడు బౌండరీలు బాది ఒత్తిడిని తగ్గించాడు. ఈ భాగస్వామ్యం భారత జట్టును పేలవమైన ఆరంభం తర్వాత మళ్లీ ఆటలోకి తీసుకువచ్చింది.

కోహ్లీ, ధోనీల పాత్ర పోషించిన యువ ఫినిషర్
సంజు శాంసన్ ఔటైన తర్వాత తిలక్ వర్మ శివమ్ దూబేతో జతకట్టాడు. ఈ సమయంలో తిలక్ తానే ప్రధాన బ్యాటర్ పాత్ర పోషిస్తూ, శివమ్ దూబేకు వేగంగా పరుగులు చేసే స్వేచ్ఛను ఇచ్చాడు. ఆఖరి వరకు క్రీజులో ఉండి, మ్యాచ్ను ముగించాలన్నదే తిలక్ లక్ష్యం. తిలక్ వర్మ ఆడిన ఈ ఇన్నింగ్స్ కేవలం భారీ షాట్లతో కూడినది కాదు. ఇది సమయస్ఫూర్తి, ఒత్తిడిని అద్భుతంగా నిర్వహించగల సామర్థ్యానికి నిదర్శనం. మధ్య ఓవర్లలో ఆటపై నియంత్రణ సాధించి, వ్యూహాత్మకంగా జట్టును విజయం వైపు నడిపించాడు.
క్రికెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తిలక్ ప్రదర్శనలో గొప్ప ఫినిషర్లైన ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీల ఆలోచనా విధానం కనిపిస్తోంది. కోహ్లీ, ధోనీలు కూడా చాలాసార్లు కష్టమైన రన్-ఛేజ్లలో ఇలాగే నిలబడి, మ్యాచ్ను చివరి వరకు తీసుకెళ్లి భారత్ను గెలిపించారు. చిన్న వయసులోనే కోహ్లీ, ధోనీల మాదిరిగా ఒత్తిడిని జయించే ఈ గురుమంత్రాన్ని తిలక్ వర్మ సొంతం చేసుకోవడం, భవిష్యత్తులో అతను సుదీర్ఘ కాలం పాటు టీమ్ ఇండియాలో కీలక ఆటగాడిగా కొనసాగడానికి ఒక మంచి సంకేతం. ఈ ఫైనల్ మ్యాచ్ భయం, ధైర్యం మధ్య జరిగిన పోరాటం. తిలక్ వర్మ ప్రశాంతమైన,నిగ్రహంతో కూడిన వ్యూహం భారత్కు ఆసియా కప్ ట్రోఫీని అందించింది. ఇది భారత క్రికెట్ భవిష్యత్తుకు శుభ సూచికగా మారింది.