Asia Cup 2025: ఆసియా కప్ 2025 టోర్నమెంట్కు సంబంధించి పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. టోర్నమెంట్ను భారత్ లేదా పాకిస్థాన్ గెలవదని ఆయన అభిప్రాయపడ్డారు. క్రికెట్ ఇప్పుడు వ్యాపారంగా మారిపోయిందని ఆయన విమర్శించారు.
ప్రోమోపై వివాదం.. బాసిత్ అలీ సంచలన వ్యాఖ్యలు
ఆసియా కప్ 2025 కోసం సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ విడుదల చేసిన అధికారిక ప్రోమో వివాదానికి దారితీసింది. ఆ ప్రోమోలో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ను అధికంగా చూపించడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన బాసిత్ అలీ.. తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ, క్రికెట్ కు ప్రాధాన్యత ఇవ్వకుండా డబ్బు సంపాదించడంపైనే బ్రాడ్కాస్టర్లు దృష్టి పెట్టారని ఆరోపించారు. ఈ టోర్నమెంట్ వల్ల కేవలం బ్రాడ్ కాస్టర్స్కు మాత్రమే లాభం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సెప్టెంబర్ 14న జరగనుంది.

విజేతలు ఆటగాళ్లు కాదు.. ప్రసారకర్తలే..
బాసిత్ అలీ తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్థాన్ లేదా శ్రీలంక విజేతలు కావని, కేవలం ప్రసారకర్తలు మాత్రమే నిజమైన విజేతలు అవుతారని పేర్కొన్నారు. "ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ లీగ్లలో వాణిజ్య ప్రయోజనాలు క్రికెట్ను వెనక్కి నెట్టాయి. ఈ ఆసియా కప్లో కూడా అదే జరుగుతుంది. పాకిస్తాన్ గెలవదు, భారత్ గెలవదు, శ్రీలంక గెలవదు, కేవలం బ్రాడ్కాస్టర్స్ మాత్రమే గెలుస్తారు" అని ఆయన అన్నారు. ఆటగాళ్లు మైదానంలో నిర్ణయాలు తీసుకోరని, ప్రసారకర్తలే ఈ నిర్ణయాలను ప్రభావితం చేస్తారని కూడా ఆయన పేర్కొన్నారు.
భారత్-పాక్ మ్యాచ్పై మిశ్రమ స్పందనలు
ఇరు దేశాల మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్పై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. బీసీసీఐకి విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి లభించినప్పటికీ.. చాలా మంది క్రికెటర్లు, అభిమానులు ఈ మ్యాచ్పై విమర్శలు చేస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ తో ఆడకూడదని అభిమానుల్లో ఒక వర్గం డిమాండ్ చేస్తోంది. దీనితో పాటు సోనీ స్పోర్ట్ నెట్వర్క్ను, ఈ మ్యాచ్ ను ప్రోత్సహిస్తున్న బీసీసీఐ, వీరేంద్ర సెహ్వాగ్ లను కూడా అభిమానులు విమర్శిస్తున్నారు.