భారత్ గెలిచిన 2011 వరల్డ్ కప్ టీంలో తనకు చోటు దక్కనందుకు చాలా బాధపడినట్లు ప్రస్తుత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. ఆ వరల్డ్ కప్ కోసం ప్రకటించిన జట్టులో తను లేకపోవడంతో చాలా బాధపడ్డానని, కనీసం రూంలో నుంచి బయటకు రాలేకపోయానని చెప్పాడు. అలాంటి సమయంలో తనకు యువరాజ్ సింగ్ చాలా సహకారం అందించాడని గుర్తుచేసుకున్నాడు. భారత్ మరోసారి వరల్డ్ కప్కు రెడీ అవుతున్న తరుణంలో ఆ జ్ఞాపకాలను రోహిత్ మనతో పంచుకున్నాడు.
2011లో భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక కలిసి వన్డే వరల్డ్ కప్ నిర్వహించాయి. ఆ టోర్నీలో స్పిన్నర్ పీయూష్ చావ్లాను తీసుకోవాలని అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోనీ అనుకున్నాడు. దీని కోసం యువ బ్యాటర్ రోహిత్ శర్మను పక్కన పెట్టాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఇటీవలే మాజీ సెలెక్టర్ బయట పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనను ఆ వరల్డ్ కప్లో పక్కన పెట్టడం గురించి రోహిత్ గుర్తుచేసుకున్నాడు.

'2011 వరల్డ్ కప్లో ఎంపిక అవ్వనప్పుడు నా మనసు విరిగిపోయింది. వరల్డ్ కప్ బృందంలో చోటు దక్కనప్పుడు జీవితంలో ఇంకేం మిగిలింది? అనుకున్నా. అలా బాధ పడుతూ నా గదిలో కూర్చుండిపోయా. భవిష్యత్తులో ఏం చేయాలో కూడా తెలియలేదు. అప్పుడు నన్ను యువీ తన రూంకి పిలిచాడు. డిన్నర్కు తీసుకెళ్లాడు. ఇలా పక్కన పెట్టినప్పుడు ఎలా అనిపిస్తుందో వివరించాడు. నీకు ఇంకా చాలా టైం ఉందంటూ నాకు ధైర్యం చెప్పాడు. ' అని రోహిత్ వెల్లడించాడు.
ప్రస్తుతం ఆసియా కప్ కోసం రెడీ అవుతున్న రోహిత్.. గత వరల్డ్ కప్లో అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా అలాంటి ప్రదర్శనే చేసేందుకు రెడీ అవుతున్నాడీ సీనియర్ బ్యాటర్. ఆసియా కప్ తొలి మ్యాచ్లో పాక్ పేసర్లను ఎదుర్కొనేందుకు నెట్స్లో తెగ శ్రమిస్తున్నాడు. ముఖ్యంగా షహీన్ అఫ్రిదీని ఎదుర్కొనేందుకు లెఫ్ట్ ఆర్మ్ పేసర్లను ఎదుర్కొంటున్నాడు.