నాలుగేళ్ల గ్యాప్ తర్వాత భారత్, పాకిస్తాన్ జట్లు వన్డే మ్యాచ్ ఆడుతున్నాయని ఫ్యాన్స్ చాలా ఆత్రుతగా ఎదురు చూశారు. కానీ ఆసియా కప్లో ఈ ఫ్యాన్స్కు నిరాశే మిగిలింది. ఉత్కంఠ భరితంగా మొదలైన ఈ మ్యాచ్ ఫలితం లేకుండానే ముగిసింది. పల్లెకెలె వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే పాక్ పేసర్లు షహీన్ అఫ్రిదీ, నసీం షా, హారిస్ రవూఫ్ చెలరేగడంతో భారత బ్యాటింగ్ తడబడింది.
కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ ఈ మ్యాచ్లో ఫెయిలయ్యారు. అదే సమయంలో యంగ్ ఓపెనర్ గిల్, గాయం నుంచి కోలుకున్న శ్రేయాస్ అయ్యర్ కూడా విఫలమయ్యారు. ఇలాంటి సమయంలో కుర్ర కీపర్ ఇషాన్ కిషన్, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అద్భుతంగా ఆడారు. పాక్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్న వీళ్లు ఇన్నింగ్స్ చక్కదిద్దారు. అయితే సెంచరీకి చేరువైన తర్వాత వీళ్లు అవుటైపోయారు.

దీంతో భారత జట్టు 266 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ పిచ్పై ఇది మంచి స్కోరే. దీంతో ఉత్కంఠ భరిత మ్యాచ్ తప్పదని అంతా అనుకున్నారు. కానీ వర్షం వల్ల ఈ మ్యాచ్ ఆగిపోయింది. పాక్ బ్యాటింగ్కు రావడం కుదరలేదు. దీంతో ఫ్యాన్స్ చాలా నిరాశ చెందారు. అయితే మరోసారి ఈ రెండు టీమ్స్ తలపడే అవకాశం ఉండటంతో ఫ్యాన్స్ కూడా ఆ మ్యాచ్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే నేపాల్ను ఓడించిన పాక్.. భారత్తో మ్యాచ్ రద్దవడంతో మూడు పాయింట్లతో సూపర్-4 దశకు చేరుకుంది. ప్రస్తుతం భారత్ కేవలం ఒక్క పాయింట్తోనే ఉంది. అయితే సోమవారం నాడు నేపాల్తో టీమిండియా మ్యాచ్ ఉంది. దీనిలో భారత్ గెలుపు దాదాపు ఖాయమే. కాబట్టి టీమిండియా కూడా సూపర్-4 దశకు చేరుకుంటుంది. ఈ స్టేజ్లో ఒక్కో టీం మూడు మ్యాచులు ఆడుతుంది.

ఈ లెక్కన సెప్టెంబర్ 10న మరోసారి భారత్, పాకిస్తాన్ జట్లు తలపడే అవకాశం ఉంది. ఈ లెక్కలు వేసుకున్న ఫ్యాన్స్ ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. కాకపోతే నేపాల్ మ్యాచ్ పూర్తయ్యే వరకు ఈ మ్యాచ్ ఎప్పుడనే విషయంపై క్లారిటీ రావడం కష్టం. ఏదేమైనా ఈసారి అయినా ఈ రెండు టీమ్స్ మధ్య ఫుల్ మ్యాచ్ జరిగితే ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుష్ అవుతారు.