ఆసియా కప్ 2023లో సూపర్-4 దశకు చేరాలంటే భారత్ తప్పక గెలవాల్సిన మ్యాచ్పై టెన్షన్ మొదలైంది. నేపాల్తో సోమవారం జరిగే మ్యాచ్కు కూడా వర్షం ముప్పు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మ్యాచ్ కూడా పాక్తో మ్యాచ్ లాగే సగం మాత్రమే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాక్పై భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. ఆ తర్వాత వర్షం కారణంగా రెండో ఇన్నింగ్స్ జరగలేదన్న సంగతి తెలిసిందే.
క్యాండీలోని పల్లెకెలె వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో గెలిచిన జట్టే సూపర్-4 దశకు చేరుతుంది. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడటం లేదు. మొదటి బిడ్డ డెలివరీ కోసం అతను ముంబై వచ్చేశాడు. సోమవారం ఉదయం పండంటి మగబిడ్డ పుట్టాడని, బాబుకు అంగద్ అని పేరు పెట్టామని వెల్లడించాడు. అతను నేపాల్తో మ్యాచ్కు అందుబాటులో ఉండడు.

ఈ మ్యాచ్ జరిగే రోజు ఉదయం వర్షం పడే అవకాశం 90 శాతం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అదే మ్యాచ్ మొదలయ్యే సమయానికి ఇది 68 శాతానికి తగ్గుతుందట. మళ్లీ సాయంత్రం రెండో ఇన్నింగ్స్ మొదలయ్యే సమయానికి వర్షం పడే అవకాశాలు మరోసారి పెరుగుతాయట. అంతకుముందు పాక్తో మ్యాచ్ కూడా ఫలితం తేలకుండానే ముగియడంతో భారత్ ఖాతాలో కేవలం ఒక్క పాయింట్ మాత్రమే ఉంది.
ఒకవేళ నేపాల్తో మ్యాచ్ పూర్తిగా జరిగి, భారత్ గెలిస్తే మూడు పాయింట్లతో టీమిండియా సూపర్-4కు చేరుకుంటుంది. నేపాల్ గెలిస్తే రెండు పాయింట్లతో ఆ టీం సూపర్-4కు చేరుతుంది. టోర్నీ ఓపెనర్గా పాకిస్తాన్ చేతిలో నేపాల్ చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. అదే ఈ మ్యాచ్ కూడా వర్షం వల్ల ఫలితం తేలకపోతే.. రెండు పాయింట్లతో భారత జట్టు సూపర్-4కు చేరుతుంది. అప్పుడే కేవలం ఒక్క పాయింట్ మాత్రమే ఉన్న నేపాల్ ఇంటి దారి పడుతుంది.