ఆసియా కప్ విషయంలో పాకిస్తాన్కు గట్టి షాక్ తగిలింది. ఆ దేశంలో నిర్వహించాల్సిన ఈ టోర్నీకి బీసీసీఐ అడ్డుచెప్తున్న సంగతి తెలిసిందే. భారత్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అంత బాగలేవు. ఈ కారణంగా తమ జట్టును పాకిస్తాన్కు పంపడం కుదరదని బీసీసీఐ తేల్చిచెప్పింది. అవసరం అయితే టోర్నీ నుంచి తప్పుకునేందుకు బీసీసీఐ రెడీగా ఉన్నట్లు సమాచారం.
ఆసియా కప్ వేదికను పాకిస్తాన్ను నుంచి మార్చాలని, ఏదైనా తటస్థ వేదికను ఎంపిక చేయాలని బీసీసీఐ డిమాండ్ చేసింది. అయితే దీనికి పీసీబీ (పాకిస్తాన్ క్రికెట్ బోర్డు) ససేమిరా అంది. ఆసియా కప్ తమ దేశంలోనే నిర్వహించాలని మంకుపట్టు పట్టింది. బీసీసీఐ కూడా వెనక్కు తగ్గలేదు. దీంతో పీసీబీ చీఫ్ నజాం సేథీ కొత్త ఐడియా ఇచ్చాడు. అదే హైబ్రీడ్ మోడల్.

భారత్ మినహా మిగతా దేశాల జట్టు పాకిస్తాన్కు వచ్చేందుకు సిద్ధంగానే ఉన్నాయని నజాం సేథీ చెప్పాడు. ఈ క్రమంలోనే భారత్ ఆడే మ్యాచులను యూఏఈలో ఏర్పాటు చేస్తామని, మిగతా మ్యాచులు మాత్రం కచ్చితంగా పాక్లోనే జరుగుతాయని చెప్పాడు. ఈ విధానంపై ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)కి వివరించాడు. దీనిపై ఒక నిర్ణయం తీసుకోవడానికి సమయం పడుతుందని అంతా భావించారు.
పాకిస్తాన్ కూడా ఈ హైబ్రీడ్ మోడల్కు బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ మద్దతు ఇస్తాయని భావించింది. ఆ దేశ వార్తాసంస్థలు కూడా దీనిపై కథనాలు ప్రచురించాయి. అయితే తాజా అప్డేట్ ప్రకారం, ఈ విషయంలో పాకిస్తాన్కు గట్టి షాక్ తగిలింది. ఈ హైబ్రీడ్ మోడల్ను శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల క్రికెట్ బోర్డులు కూడా నిరాకరించాయని సమాచారం. ఈ మూడు దేశాలు నిరాకరించడంతో హైబ్రీడ్ మోడల్ కూడా గంగలో కలిసినట్లే అయింది.
దీంతో ఆసియా కప్ను కచ్చితంగా తటస్థ వేదికలో నిర్వహించాల్సిన అవసరం పాక్కు ఏర్పడింది. శ్రీలంక, యూఏఈ ఈ ఛాన్స్ కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వన్డే వరల్డ్ కప్ ముందు జరిగే ఆసియా కప్ అన్ని దేశాలకూ ముఖ్యమే. కాబట్టి దాన్ని రద్దు చేయడం కుదరదు. కనుక దీన్ని కచ్చితంగా తటస్థ వేదికపైనే నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.