అసలు జరుగుతుందో? లేదో? అని టెన్షన్ పడిన ఆసియా కప్ 2023కి ఏసీసీ పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. పాక్ వేదికగా జరగాల్సిన ఈ టోర్నీని హైబ్రీడ్ మోడల్లో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భారత్ ఆడే మ్యాచులతో పాటు, మరికొన్ని కీలకమైన మ్యాచులను శ్రీలంకలో నిర్వహించాలని నిర్ణయించారు. భారత్ ఆడే మ్యాచులన్నీ ఇక్కడే జరుగుతాయి.
అయితే శ్రీలంకలో మ్యాచ్ జరుగుతున్నా కూడా.. పాక్ను అక్కడ ఓడించడం భారత్కు కష్టంగా మారనుంది. ఎందుకంటే భారత్, పాక్ మ్యాచ్ను లంకలోని డంబుల్లా స్టేడియంలో నిర్వహించాలని డిసైడ్ చేశారట. ఈ స్టేడియంలో భారత్ రికార్డు అంతగొప్పగా లేదు. అదే సమయంలో పాక్కు ఇక్కడ అదిరిపోయే రికార్డు ఉంది. డంబుల్లాలో అత్యధిక స్కోరు చేసిన జట్టు పాకిస్తానే.

ఇక్కడ 2010లో జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్పై పాకిస్తాన్ ఏకంగా 385 పరుగులు చేసింది. అంతేకాదు, ఈ స్టేడియంలో అత్యధిక విజయవంతమైన ఛేజ్ కూడా పాకిస్తానే చేసింది. శ్రీలంకతో 2009లో జరిగిన మ్యాచ్లో 289 పరుగుల టార్గెట్ను పాక్ కేవలం నాలుగు వికెట్లే కోల్పోయి ఛేదించింది. అదే సమయంలో భారత్ మాత్రం ఈ స్టేడియంలో చాలా చెత్త ప్రదర్శన చేసిందనే చెప్పాలి.
ఈ స్టేడియంలో అత్యల్ప స్కోరుకు ఆలౌట్ అయిన టీం ఇండియానే. 2010లో న్యూజిల్యాండ్తో జరిగిన మ్యాచ్లో భారత జట్టు కేవలం 88 పరుగులకే ఆలౌట్ అయింది. పేసర్లకు సహకరించే ఈ పిచ్పై భారత ఆటగాళ్లు తేలిపోయారు. అంతేకాదు, ఈ స్టేడియంలో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్ శిఖర్ ధవన్. అతను 2017లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 132 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.
కానీ ఈసారి ఆసియా కప్ ఆడే జట్టులో ధవన్కు చోటు దక్కడం అసాధ్యంగా కనిపిస్తోంది. మిగతా బ్యాటర్ల రికార్డులు ఇక్కడ అంత గొప్పగా లేవు. ఈ క్రమంలో ఆసియా కప్లో భారత్, పాక్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఒకవేళ పాక్ కనుక గెలిస్తే.. వరల్డ్ కప్లో ఆ టీంకు కావలసినంత కాన్ఫిడెన్స్ వస్తుంది. అదే సమయంలో టీమిండియా కాన్ఫిడెన్స్ దారుణంగా దెబ్బతింటుంది. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.