ఆసియా కప్లో భారత జట్టు అదరగొట్టింది. పాకిస్తాన్ను చిత్తుగా ఓడించిన భారత్.. ఆ తర్వాత శ్రీలంకపై కూడా ఆధిపత్యం చెలాయించింది. ఈ టీంపై 41 పరుగుల తేడాతో గెలిచి ఆసియా కప్ ఫైనల్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. అయితే ఇలా శ్రీలంకపై గెలిచినా కూడా.. టీమిండియాలో కొన్ని సమస్యలు చాలా స్పష్టంగా బయటపడ్డాయి. వీటిని సరిదిద్దోకోలేదంటే వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీలో భారత్కు తిప్పలు తప్పవు. అవేంటంటే?
బంతితో తేలిపోయిన అక్షర్:స్పిన్ పిచ్ను పూర్తిగా ఉపయోగించుకోవాలని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అనుకున్నాడు. ఈ క్రమంలోనే శార్దూల్ ఠాకూర్ను కాదని అక్షర్ పటేల్ను జట్టులోకి తీసుకున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అతను బ్యాటుతో ఫర్వాలేదనిపించాడు. కానీ ఆ తర్వాత బంతితో మాత్రం తేలిపోయాడు.

అద్భుతమైన ఫామ్లో ఉన్న అక్షర్.. కచ్చితంగా వరల్డ్ కప్ టీంలో జడేజాకు బ్యాకప్గా ఉంటాడని అందరికీ తెలుసు. ఈ ఏడాదిలో అక్షర్ బ్యాటింగ్ కూడా అదే రేంజ్లో సాగింది. అయితే బంతితో మాత్రం అతను పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ ఏడాది ఆరు వన్డేలు ఆడిన అతను 5.7 ఎకానమీతో కేవలం మూడు వికెట్లే తీసుకున్నాడు.
జడేజా, అక్షర్ మధ్య ఈ బౌలింగ్ తేడా శ్రీలంకతో మ్యాచులో చాలా స్పష్టంగా కనిపించింది. ఈ మ్యాచ్లో జడ్డూ 2/33 గణాంకాలతో ఆకట్టుకోగా.. అక్షర్ కనీసం ఒక్క వికెట్ కూడా తీసుకోలేదు. అదే సమయంలో లంక పార్ట్ టైమర్లు కూడా వికెట్లు తీసుకోవడం గమనార్హం. దీనిపై వరల్డ్ కప్లోగా టీమిండియా ఫోకస్ పెట్టడం చాలా అవసరం.

జడ్డూ బ్యాటింగ్ ఫెయిల్యూర్..:ఇటీవలి కాలంలో బంతితో జట్టును ఆదుకుంటున్న రవీంద్ర జడేజా.. ముఖ్యంగా వన్డేల్లో బ్యాటుతో తేలిపోతున్నాడు. 2022కు ముందు వన్డేల్లో బ్యాటుతో చెలరేగిన అతను ఇప్పుడు వైట్ బాల్ ఫార్మాట్లలో ఏమాత్రం రాణించడం లేదు. శ్రీలంకతో మ్యాచులో కూడా 19 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులే చేశాడీ ఎడం చేతి వాటం బ్యాటర్.
కేవలం ఈ ఒక్క ఇన్నింగ్స్ మాత్రమే కాదు. ఓవరాల్గా ఈ ఏడాదిలో జడేజా 8 వన్డేలు ఆడాడు. వీటిలో 27.8 సగటు, 57.6 స్ట్రైక్ రేటుతో కేవలం 131 పరుగులు మాత్రమే చేశాడు. ఈ స్ట్రైక్ రేటు ఎంత తక్కువో వేరే చెప్పాల్సిన పని లేదు. జడేజా స్థాయి ఆటగాడి నుంచి ఎవరూ ఇంత పేలవమైన ప్రదర్శన ఆశించరు.
బిగుస్తున్న స్పిన్ ఉచ్చు..:వరల్డ్ కప్ జరిగేది భారత్లోనే. ఇక్కడ పిచ్లు స్పిన్కు ఎంత సహకరిస్తాయో అందరికీ తెలిసిందే. కానీ భారత బ్యాటింగ్ లైనప్ మాత్రం దీన్ని ఎదుర్కోవడానికి రెడీగా లేదు. చివరకు మ్యాచ్ గెలిచాం కదా అనుకుంటే సరిపోదు. ఎందుకంటే భారత బ్యాటింగ్ బలహీనతలను శ్రీలంక స్పిన్నర్లు చాలా ఈజీగా ఉపయోగించుకున్నారు.

భారత బ్యాటర్లు స్పిన్ను బాగా ఆడతారనేది గతంలో మాట. ప్రస్తుతం జట్టులోని భారత బ్యాటర్లు స్పిన్ను ఎదుర్కోవడానికి నానాతిప్పలు పడుతున్నారు. రిస్ట్ స్పిన్నర్ వేసు నార్మల్ డెలివరీకి, గూగ్లీకీ తేడా కనిపెట్టలేకపోతున్నారు. శ్రీలంకతో మ్యాచ్ చూసిన ఫ్యాన్స్కు వరల్డ్ కప్లో కూడా ఇలాంటి సీన్సే కనిపిస్తాయని చాలా భయం వేసిన మాట మాత్రం వాస్తవం.
శ్రీలంక స్పిన్నర్లను సమర్ధవంతంగా కేఎల్ రాహుల్ ఒక్కడే ఎదుర్కొన్నాడు. ఇది కొంత ఊరటనిచ్చే విషయమే.. కానీ వరల్డ్ కప్లో ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియా జట్ల వద్ద మంచి స్పిన్ బౌలింగ్ ఎటాక్ ఉంది. అలాంటి టీమ్స్పై భారత బ్యాటింగ్ ఇలాగే ఆడితే వరల్డ్ కప్ ముద్దాడటం అసాధ్యమనే చెప్పాలి.