ఆసియా కప్లో అభిమానులకు మరోసారి 'నాగిని' వైరం చూసే ఛాన్స్ దక్కింది. గ్రూప్ దశలో శ్రీలంక, బంగ్లాదేశ్ తలపడిన మ్యాచ్ పూర్తి ఏకపక్షంగా సాగిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాను శ్రీలంక బౌలర్లు కట్టడి చేశారు. దీంతో బంగ్లా టైగర్స్ పెద్ద స్కోరు చేయలేకపోయారు. దీంతో ఆ మ్యాచ్లో శ్రీలంక విజయం సాధించింది. ఈ క్రమంలో సూపర్-4 దశలో ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని బంగ్లాదేశ్ భావిస్తోంది.
కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా ఈ రెండు జట్లు మరోసారి తలపడేందుకు రెడీ అయ్యాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ షకీబల్ హసన్ తాము ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. మ్యాచ్ మధ్యలో వర్షం పడే అవకాశం ఉండటంతోనే అతను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొలంబోలో విపరీతంగా వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే.

ఈ పిచ్ కొంచెం స్లోగా ఉండే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. కాబట్టి భారీ స్కోర్లు నమోదవడం కష్టమే అని చెప్పాలి. తమ జట్టులో ఒక ఎక్స్ట్రా బౌలర్ను తీసుకున్నామని, ఇది తమకు చావో రేవో తేలే మ్యాచ్ అని షకీబల్ హసన్ అన్నాడు. 'ఇది మేం తప్పక గెలవాల్సిన మ్యాచ్. అంతకన్నా ముందు మేం కొన్ని బేసిక్ విషయాలపై ఫోకస్ పెట్టాలి. పాకిస్తాన్తో పోలిస్తే ఇక్కడి పిచ్ భిన్నంగా ఉంటుంది. కాబట్టి అడ్జస్ట్ అవడం ముఖ్యం' అని షకీబల్ హసన్ చెప్పుకొచ్చాడు.
తమ టీంలో అఫీఫ్ హుస్సేన్ స్థానంలో నాసుమ్ అహ్మద్ ఆడుతున్నట్లు చెప్పాడు. ఇక తాము టాస్ గెలిచి ఉంటే ముందుగా బ్యాటింగ్ చేసేవాళ్లమని, ఇప్పుడు అదే ఛాన్స్ దక్కిందని శ్రీలంక సారధి దాసున్ షనక అన్నాడు. రెండో ఇన్నింగ్స్లో పిచ్ నుంచి కొంత టర్న్ లభించే అవకాశం ఉందన్నాడు. బ్యాటర్లు కీలకమైన పరుగులు చేయాలని, బౌలర్లు కూడా తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని తమ క్యాంపులో మాట్లాడుకున్నట్లు చెప్పాడు.