ఆసియా కప్ సూపర్-4 దశలో కూడా 'నాగిని' వైరంలో శ్రీలంకే పైచేయి సాధించింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకను బంగ్లా బౌలర్లు బాగానే కట్టడి చేశారు. అయితే సదీర సమరవిక్రమ్ (93) అద్భుతంగా పోరాడాడు. అతనితోపాటు కుశాల్ మెండిస్ (50), పాథుమ్ నిస్సంక (40) కీలకమైన ఇన్నింగ్సులు ఆడారు.
ఇలా శ్రీలంక బ్యాటర్లు రాణించడంతో ఆ టీం నిర్ణీత 50 ఓవర్లలో 257 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బంగ్లాకు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఆ టీం ఓపెనర్లు మహమ్మద్ నయీం (21), మెహదీ హసన్ మిరాజ్ (28) ఎక్కువ స్కోరు చేయకుండానే పెవిలియన్ చేరారు. అయితే ఆ తర్వాత వచ్చిన లిటాన్ దాస్ (15), కెప్టెన్ షకీబల్ హసన్ (3) ఇద్దరూ దారుణంగా విఫలమయ్యారు. దీంతో ఆ తర్వాత వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి పెరిగింది.

ఇలాంటి సమయంలో బాధ్యతగా ఆడతాడని అనుకున్న సీనియర్ ప్లేయర్ ముష్ఫికర్ రహీం (29) కూడా పెద్దగా రాణించలేదు. అయితే కుర్ర ప్లేయర్ తౌహీద్ హృదోయ్ (82) అద్భుతంగా పోరాడాడు. కానీ చివర్లో అతనికి సహకారం అందించే బ్యాటరే లేకపోయారు. రహీం అవుటైన తర్వాత వచ్చిన షమీమ్ హుస్సేన్ (5), టస్కిన్ అహ్మద్ (1), షోరిఫుల్ ఇస్లాం (7) కూడా అతనికి సహకారం అందించలేదు. చివర్లో నాసుమ్ అహ్మద్ (15) జట్టును విజయతీరాలకు చేర్చేలా కనిపించాడు.
కానీ శ్రీలంక స్పిన్నర్ మహీష్ తీక్షణ, మతీష పతిరాణా ఇద్దరూ చివర్లో అద్భుతంగా బౌలింగ్ చేశారు. వీళ్లిద్దరూ చెరో మూడు వికెట్లతో చెలరేగారు. దీంతో బంగ్లాదేశ్ కోలుకోలేకపోయింది. ఈ క్రమంలో ఆ జట్టు లక్ష్యానికి 21 పరుగుల దూరంలో కుప్పకూలింది. శ్రీలంక కెప్టెన్ దాసున్ షనక కూడా మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు. దునిత్ వెల్లలెగె ఒక వికెట్ తీసుకున్నాడు. దీంతో శ్రీలంక సూపర్-4 దశలో మొదటి విజయం సాధించింది.