ఆసియా కప్, వరల్డ్ కప్ వంటి కీలకమైన టోర్నీలకు ముందు టీమిండియా కీలక ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్ రీఎంట్రీపై చాలా చర్చ జరిగింది. వెన్ను నొప్పితో కొంత కాలంగా బాధ పడుతున్న అతను శస్త్ర చికిత్స అనంతరం ఎన్సీయేలో రెస్ట్ తీసుకున్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా కోలుకున్నాడు.
అయితే శస్త్ర చికిత్స తర్వాత అతను ఎలాంటి కాంపిటీటివ్ క్రికెట్ ఆడలేదు. దీంతో ఆసియా కప్లో అతన్ని తీసుకుంటారా? అని పెద్ద చర్చ జరిగింది. చివరకు సెలెక్టర్లు అతన్ని ఆసియా కప్కు ఎంపిక చేశారు. అయితే ఈ టోర్నీలో ఆడాలంటే ఆటగాళ్లు అందరూ ఫిట్నెస్ నిరూపించుకోవాలని సూచించారు.

దీని కోసం బెంగళూరులో ఐదు రోజుల ప్రిపరేటరీ క్యాంప్ ఏర్పాటు చేసింది బీసీసీఐ. దీనిలో భాగంగా ప్రాక్టీస్ మ్యాచ్లు నిర్వహించింది. ఆసియా కప్ టీం ప్రకటించినప్పుడు అయ్యర్ పూర్తి ఫిట్గా ఉన్నట్లు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా స్పష్టం చేశాడు. కానీ తను మ్యాచ్ ఫిట్గా ఉన్నాడా? అని కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.
వెన్ను గాయం నుంచి కోలుకొని నేరుగా ఆసియా కప్లో బరిలో దిగడం అంత ఈజీ కాదు. ఈ క్రమంలోనే ఇటీవల ఎన్సీయేలో ప్రాక్టీస్ మ్యాచ్ పెట్టారట. దీనిలో పాల్గొన్న అయ్యర్ అద్భుతంగా ఆడి తన ఫిట్నెస్ నిరూపించుకున్నట్లు సమాచారం. ఈ మ్యాచ్లో 38 ఓవర్లపాటు అయ్యర్ బ్యాటింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత 50 ఓవర్లు ఫీల్డింగ్ చేశాడట.
ఈ గేమ్లో అయ్యర్ ఏకంగా 199 పరుగులు చేసి ఆకట్టుకున్నట్లు సమాచారం. 'ఎన్సీయేలో బౌలర్లపై అయ్యర్ విరుచుకుపడ్డాడు. తన ఫిట్నెస్ నిరూపించుకోవడానికి ప్రాక్టీస్ మ్యాచ్లో 199 పరుగులు చేశాడు. ఆ తర్వాత 50 ఓవర్లపాటు ఫీల్డింగ్ చేశాడు' అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాతనే అయ్యర్కు ఆసియా కప్ బృందంలో చోటు దక్కినట్లు తెలుస్తోంది.