టీమిండియాకు మిడిలార్డర్ సమస్య ఇప్పటిది కాదు. యువరాజ్ సింగ్ జట్టులో చోటు కోల్పోయిన తర్వాత టీంను ఈ సమస్య వెంటాడుతూనే ఉంది. ఈ క్రమంలో ఆసియా కప్లో యంగ్ స్టార్ శ్రేయాస్ అయ్యర్ రీఎంట్రీ ఇవ్వడం టీమిండియాకు చాలా కీలకమని మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. అతనొక్కడే టీమిండియా మిడిలార్డర్ సమస్యను తీర్చగలడని అభిప్రాయపడ్డాడు.
ఆలూర్లో ప్రిపరేటరీ క్యాంప్లో అయ్యర్ ఫిట్గా కనిపించాడని మంజ్రేకర్ చెప్పాడు. మ్యాచ్ ఫిట్నెస్ సాధించినట్లే కనిపిస్తున్నాడని అన్నాడు. 'శ్రేయాస్ అయ్యర్ ఫిట్గా కనిపించడం టీమిండియాకు చాలా పెద్ద పాజిటివ్. క్యాంప్లో నెట్ ప్రాక్టీస్లో రన్నింగ్ కూడా చేర్చారు. అయ్యర్ బాగానే పరిగెడుతున్నాడు. అతని రీఎంట్రీతో టీమిండియా మిడిలార్డర్ సమస్య తీరుతుంది' అని మంజ్రేకర్ తెలిపాడు.

'టీమిండియాను మిడిలార్డర్ సమస్య చాలా కాలంగా వెంటాడుతోంది. ప్రస్తుతానికైతే అయ్యర్ నెట్స్లో ఫిట్గా కనిపిస్తున్నాడు. త్వరలోనే మ్యాచ్ ఫిట్నెస్ కూడా సాధిస్తాడు' అని చెప్పిన మంజ్రేకర్.. టీమిండియాకు నాలుగో నెంబర్లో చాలా తక్కువ ఆప్షన్లు ఉన్నాయని పేర్కొన్నాడు. గత వరల్డ్ కప్లో ఇది చాలా స్పష్టంగా కనిపించిందని చెప్పాడు. అయితే ఈసారి మాత్రం భారత్ వద్ద చాలా చాయిస్లు ఉన్నాయని గుర్తుచేశాడు.
'లాస్ట్ వరల్డ్ కప్లో భారత్ వద్ద నాలుగో నెంబర్లో సరైన ఆప్షన్స్ లేవు. దినేష్ కార్తీక్, రిషభ్ పంత్ వంటి వాళ్లను ఈ ప్లేస్లో ట్రై చేశాం. కానీ ఈసారి పరిస్థితి వేరుగా ఉంది. ఇప్పుడు శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, తిలక్ వర్మ వంటి వాళ్లు ఈ రేసులో ఉన్నారు' అని మంజ్రేకర్ వివరించాడు. వీళ్లందరూ ఈ స్థానానికి న్యాయం చేయగల సమర్ధులే అని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.

ఇటీవలి కాలంలో కూడా సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ వంటి వాళ్లను నాలుగో నెంబర్లో ప్రయత్నించారు. వీరిలో సంజూ ఈ స్థానంలో ఆకట్టుకున్నాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ దారుణంగా తేలిపోయాడు. కానీ ఈ స్థానంలో యువీ తర్వాత బాగా సక్సెస్ అయిన ప్లేయర్ మాత్రం అయ్యర్ అనే చెప్పాలి. అతని చేరికతో టీమిండియా మిడిలార్డర్ బలంగా మారుతుందని అభిమానులు కూడా నమ్ముతున్నారు.