వెన్నుగాయం నుంచి కోలుకొని ఆసియా కప్లో మళ్లీ టీమిండియా రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్న ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమయంలో అయ్యర్కు వెన్నుగాయం తిరగబెట్టింది. దీంతో ఆటకు దూరమైన అతను శస్త్రచికిత్స అనంతరం నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీయే)లో విశ్రాంతి తీసుకొని కోలుకున్నాడు. ఆసియా కప్లో రీఎంట్రీ ఇచ్చే ముందు తన అనుభవాన్ని అయ్యర్ పంచుకున్నాడు.
గతంలో ఏం జరిగింది? రేపు ఏం జరగబోతోంది? అని ఆలోచించే మనిషిని కాదని, తాను ప్రస్తుతంలో బతుకుతానని అయ్యర్ చెప్పాడు. 'ప్రస్తుతంలో బతుకుతూ నా రొటీన్స్ కరెక్ట్గా చేయడం నాకు ముఖ్యం. గతంలో ఏం జరిగింది? తర్వాత ఏం జరుగుతుంది? అని ఆలోచించడం నాకు ఇష్టం ఉండదు. అన్నీ సరిగా చేస్తున్నానా? లేదా? అని చెక్ చేసుకుంటున్నా' అని చెప్పాడు.

'ఇక ప్రిపరేషన్స్ అంటారా.. రెండ్రోజులపాటు అందరితో కలిసి ప్రాక్టీస్ చేశా. ఇది కాంపిటీటివ్గా కూడా జరిగింది. ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నందుకు సంతోషిస్తున్నా' అని పేర్కొన్నాడు. అదే సమయంలో గాయం నుంచి కోలుకునే సమయంలో తన బాధ గురించి కూడా వివరించాడు. వెన్నెముకలో ఒక డిస్క్ పక్కకు తప్పుకోవడం వల్ల నరాలపై ఒత్తిడి పెరిగి తీవ్రమైన నొప్పి వచ్చినట్లు వెల్లడించాడు.
'ఒక ప్రొఫెషనల్ క్రీడాకారుడిగా.. నొప్పి తగ్గకపోతే చాలా కష్టంగా ఉంటుంది. నా అదృష్టం కొద్ది మంచి మిత్రులు, సహాయక సిబ్బంది నాకు లభించారు. అలాంటి కష్టకాలంలో నాకు అండగా ఉంది వాళ్లే. గాయం వల్ల నేను చాలా ప్యానిక్ అయిపోయా. కానీ అలాంటి పరిస్థితిలో ఓపిక పట్టడం చాలా ముఖ్యం. నేను ఇంత త్వరగా కోలుకుంటానని అనుకోలేదు' అని చెప్పాడు. అలాగే తనకు అండగా నిలిచి, మద్దతు తెలిపిన కుటుంబ సభ్యులకు, మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేశాడు.