అన్ని అవరోధాలు దాటుకొని ఆసియా కప్ జరిగేందుకు అన్నీ సిద్ధమయ్యాయి. ఈ టోర్నీ షెడ్యూల్ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కొత్త ప్రెసిడెంట్ జకా అష్రాఫ్ విడుదల చేశారు. చాలా రోజుల పాటు ఈ టోర్నీ నిర్వహణపై నీలిమేఘాలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్కు తమ జట్టును పంపడం కుదరదని బీసీసీఐ తేల్చిచెప్పడమే దీనికి కారణం. అయితే చివరకు ఈ టోర్నీని హైబ్రీడ్ మోడల్లో నిర్వహించేందుకు ఏసీసీ అనుమతించింది.
ఈ క్రమంలోనే బుధవారం నాడు ఆసియా కప్ షెడ్యూల్ను ఏసీసీ విడుదల చేసింది. ఈ సందర్భంగా ఏసీసీ ప్రెసిడెంట్ జై షా మాట్లాడుతూ.. 'అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పురుషుల ఆసియా కప్ 2023 షెడ్యూల్ను విడుదల చేస్తున్నందుకు చాలా థ్రిల్గా ఫీలవుతున్నాం. ఆసియాలోని దేశాలన్నింటినీ పోటీ, సౌభ్రాతృత్వంతో ఏకం చేసే వేదిక ఇది. ఈ టోర్నీలో పాల్గొంటున్న అన్ని జట్లకు శుభాకాంక్షలు తెలుపుతున్నా' అన్నాడు.

పీసీబీ చైర్మన్ జకా అష్రాఫ్ కూడా ఈ సందర్భంగా మాట్లాడాడు. 'ఈ టోర్నీ నిర్వాహకులుగా ఎలాంటి ప్లాన్స్ వేసుకోవాలనే విషయంలో ఈ షెడ్యూల్ చాలా క్లారిటీ ఇస్తోంది. టోర్నీలో పాల్గొనే జట్లకు, ప్రేక్షకులకు అందరూ ఎంజాయ్ చేసే విధంగా మేం దీన్ని రూపొందిస్తాం. మా దేశంలో హాస్పిటాలిటీ అద్భుతంగా ఉంటుందని ఇతర దేశాలకు తెలియజేసే అవకాశం ఇది. కచ్చితంగా ఈ విషయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకుంటాం' అని జాకా అష్రాఫ్ అన్నాడు.
ఈ టోర్నీలో పాల్గొనే జట్లను రెండు గ్రూపులుగా విడగొట్టారు. మొదటి గ్రూప్లో పాకిస్తాన్, ఇండియా, నేపాల్ ఉన్నాయి. గ్రూప్-బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి. టోర్నీలో మొదటి మ్యాచ్లో పాకిస్తాన్, నేపాల్ తలపడతాయి. ఈ మ్యాచ్కు పాకిస్తాన్లోని ముల్తాన్ స్టేడియం వేదిక కానుంది. ఇక భారత జట్టు తమ తొలి మ్యాచ్లో పాకిస్తాన్ను ఎదుర్కొంటుంది.
సెప్టెంబరు 2వ తేదీన ఈ రెండు జట్లు శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియం వేదికగా తలపడతాయి. ఆ తర్వాత భారత్, నేపాల్ మ్యాచ్ కూడా సెప్టెంబరు 4న ఇదే స్టేడియంలో జరుగుతుంది. ఇక ఫైనల్కు కొలంబోలోని ఆర్.ప్రేమదాస ఇంటర్నేషనల్ స్టేడియం వేదిక కానుంది. ఒకవేళ ఏదైనా జరిగి ఆ రోజు ఫైనల్ జరగకపోతే.. రిజర్వ్ డే అయిన 18వ తేదీన మ్యాచ్ నిర్వహిస్తారు.