టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఆలయాల బాట పట్టాడు. ఆసియా కప్కు ముందు కుటుంబంతో కలిసి ఆంధ్రప్రదేశ్లోని తిరుమల బాలాజీని దర్శించుకున్నాడు. తిరుపతిలో రోహిత్ కుంటుంబం కనిపించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఇటీవలి కాలంలో టీమిండియా ప్లేయర్లు అందరూ ఆలయాలు సందర్శిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది పేలవ ఫామ్ నుంచి బయట పడటానికి ముందు విరాట్ కోహ్లీ కూడా ఆలయ సందర్శనం చేశాడు. ఇక అప్పటి నుంచి టీమిండియా ప్లేయర్లు అవకాశం దొరికినప్పుడల్లా ఆలయాలకు వెళ్తుండటం కనిపిస్తోంది.

ఇటీవల వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీసులో భారత జట్టుకు రోహిత్ సారధ్యం వహించాడు. ఈ సిరీసులో చివరి రెండు వన్డేల్లో రోహిత్ ఆడలేదు. ఈ మ్యాచుల్లో హార్దిక్ పాండ్యా నేతృత్వంలో టీమిండియా ఆడింది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరీసులో కూడా రోహిత్ ఆడటం లేదు. ఆ తర్వాత ఐర్లాండ్తో జరిగే మూడు టీ20ల సిరీసులో కూడా సీనియర్లకు బీసీసీఐ విశ్రాంతినిచ్చింది.
దీంతో ఈ నెలాఖరులో మొదలయ్యే ఆసియా కప్లోనే మళ్లీ రోహిత్ మైదానంలో దిగుతాడు. ఈసారి ఆసియా కప్ను ఎలాగైనా గెలవాలని టీమిండియా భావిస్తోంది. అచ్చొచ్చిన వన్డే ఫార్మాట్లో ఈ టోర్నీ జరుగుతుండటం కూడా దీనికి ఒక కారణం. దానికితోడు కోహ్లీ, గిల్ సహా పలువురు ప్లేయర్లు మంచి ఫామ్లో ఉన్నారు.
రోహిత్ కూడా ఫామ్ అందుకుంటే ఆసియా కప్తోపాటు వరల్డ్ కప్లో కూడా టీమిండియాకు ఎదురుండదు. ఆసియా కప్ నుంచే దేశంలో వరల్డ్ కప్ హీట్ మొదలవుతుందని అంతా అనుకుంటున్నారు. ఇలాంటి కీలకమైన టోర్నీ ముందు రోహిత్ శర్మ ఇలా తిరుపతి వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడంపై ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.

కొందరేమో రోహిత్ కూడా కోహ్లీ బాటలోనే నడుస్తున్నాడని అంటున్నారు. మరికొందరేమో తను కూడా కోహ్లీ అనుకుంటున్నాడంటూ జోకులు వేస్తున్నారు. అయితే టీమిండియా ఫ్యాన్స్లో చాలా మంది రోహిత్కు మంచి జరగాలని కోరుకుంటున్నారు. విమర్శలు చేస్తున్న వారిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ, రోహిత్ వంటి వాళ్లు ఏం చేసినా విమర్శించడం కొంత మందికి ఫ్యాషన్ అయిపోయిందంటూ మండిపడుతున్నారు.