ప్రస్తుతం టీమిండియా చాలా కీలకమైన ఫేజ్లో ఉంది. రోహిత్ కెప్టెన్సీలో ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ కోసం ఈ టీం రెడీ అవుతోంది. ఈ రెండు టోర్నీలకు జట్లను ప్రకటించినప్పుడు చాలా చర్చలు జరిగాయి. గాయం నుంచి కోలుకొని రాహుల్ను, వన్డేల్లో రాణించని సూర్యకుమార్ను తీసుకోవడంపై పలువురు విమర్శలు గుప్పించారు. ఈ విమర్శల నేపథ్యంలో డ్రెస్సింగ్ రూం వాతావరణం కూడా టెన్స్గా మారితే జట్టుకు ఇబ్బందులు తప్పవు.
అయితే అలాంటి టెన్షన్ ఏమీ అక్కర్లేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. తమ డ్రెస్సింగ్ రూం చాలా సరదాగా ఉందని, ఏ ఆటగాళ్లతో కూడా తమకు కమ్యూనికేషన్ గ్యాప్ లేదని వివరించాడు. హోడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఆటగాళ్లు, సహాయక సిబ్బంది అందరితో కమ్యూనికేషన్కు పెద్దపీట వేస్తాడని రోహిత్ చెప్పాడు. ఏమాత్రం కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకుంటాడని తెలిపాడు.

'రాహుల్ భాయ్ విషయానికొస్తే.. ఆయనపై నాకు చాలా గౌరవం ఉంది. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ఎవరితోనూ కమ్యూనికేషన్ గ్యాప్ ఉండటం రాహుల్కు ఇష్టం ఉండదు. విషయం ఏదైనా సరే సంబంధిత వ్యక్తికి మొఖమాటం లేకుండా చెప్పేయాలనేదే రాహుల్ భాయ్ నెంబర్ వన్ రూల్. దీంతో అందరూ చాలా ఓపెన్గా ఉంటారు. ఆటగాళ్లు, మ్యాచులు అన్నిటి గురించి మాట్లాడుకుంటాం. తనతో నా టైంను బాగా ఎంజాయ్ చేస్తున్నా' అని రోహిత్ చెప్పాడు.
అలాగే టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో కూడా తన అనుబంధం గురించి రోహిత్ వెల్లడించాడు. తామిద్దరం కూడా వచ్చే క్రికెట్ సిరీసుల గురించి చర్చించుకుంటామని చెప్పుకొచ్చాడు. 'మేం క్రీజులో ఉన్నప్పుడు ఎవరు బౌలింగ్ చేస్తున్నారు? వాళ్లను ఎలా ట్యాకిల్ చేయాలి? అని మాట్లాడుకుంటాం. మామూలుగా అయితే రాబోయే సిరీసులు, ఏ ప్లేయర్లపై ఒక కన్నేసి ఉంచాలి? అని చర్చించుకుంటూనే ఉంటాం' అని పేర్కొన్నాడు.