ప్రెస్ మీటింగుల్లో సరదా కామెంట్స్ చేస్తూ అందర్నీ నవ్వించడం ఒక కళ అనుకుంటే.. అది అందరి కన్నా బాగా వచ్చిన వారిలో రోహిత్ శర్మ ఒకడు. అతను ఎప్పుడు ప్రెస్ మీట్లో పాల్గొన్నా ఏదో ఒక కామెంట్తో అందరికీ నవ్వు తెప్పించేస్తాడు. ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసిన తర్వాత కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఆసియా కప్ ట్రోఫీ అందుకున్న రోహిత్.. మీడియాతో మాట్లాడాడు.
2018లో విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చిన నేపథ్యంలో అప్పుడు కూడా టీమిండియాకు రోహిత్ కెప్టెన్సీ వహించాడు. ఆ ఏడాది ఆసియా కప్ను కూడా భారత్కు అందించాడీ స్టార్ బ్యాటర్. దీంతో కెప్టెన్గా భారత్కు రెండు ఆసియా కప్లో అందించిన కెప్టెన్గా రికార్డు సృష్టించాడు. ఇక ఈసారి శ్రీలంకపై అన్ని విభాగాల్లో ఆధిపత్యం చెలాయించిన భారత్ జయభేరి మోగించింది.

సిరాజ్ ఏకంగా ఆరు వికెట్లతో చెలరేగాడు. అతనికితోడు హార్దిక్ పాండ్యా మూడు వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా ఒక వికెట్తో రాణించారు. దీంతో భారత పేసర్లే అన్ని వికెట్లు తీసుకొని లంకను కేవలం 50 పరుగులకే ఆలౌట్ చేశారు. లక్ష్య ఛేదనలో గిల్, కిషన్ ఇద్దరూ ఓపెనింగ్కు వచ్చి కేవలం 6.1 ఓవర్లలోనే భారత్కు విజయాన్ని కట్టబెట్టారు.
ఈ విజయంతో తర్వాత నిర్వహించిన ప్రెస్ మీట్లో రోహిత్ మాట్లాడుతుండగా బాణాసంచా పేల్చారు. బయటి నుంచి వస్తున్న ఆ చప్పుడుకు తను కాసేపు మాట్లాడకుండా వెయిట్ చేసిన రోహిత్.. 'వరల్డ్ కప్ గెలిచిన తర్వాత పేల్చండి' అంటూ కామెంట్ చేశాడు. ఆసియా కప్ ఫైనల్లో భారత జట్టు ఆధిపత్యం చెలాయించిన ఆనందంలోనే ఫ్యాన్స్ ఇలా క్రాకర్స్ పేల్చి సంబరాలు చేసుకున్నారు.
ఈ విజయంతో వరల్డ్ కప్ ముందు భారత్ సన్నాహకాలు ముగిసినట్లయింది. బుమ్రా, కేఎల్ రాహుల్ ఇద్దరూ కూడా మళ్లీ ఫామ్ అందుకున్నారు. గాయాల నుంచి కోలుకున్న వీరు ఎలా రాణిస్తారని అనుమానాలు ఉండేవి. వీటికి ఆసియా కప్లో సమాధానాలు లభించాయి. అలాగే హార్దిక్ పాండ్యా కూడా అవకాశం దక్కినప్పుడల్లా ఇటు బ్యాటుతో, అటు బంతితో రాణించాడు. వరల్డ్ కప్లో వీళ్లు ముగ్గురూ టీమిండియాకు చాలా కీలకం అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు.