టీమిండియాలో బాగా మతిమరుపు ఉన్న వారిలో రోహిత్ శర్మ ఒకడు. ఈ విషయాన్ని విరాట్ కోహ్లీ 2017లో ఒక ప్రెస్ మీట్లో బయట పెట్టాడు. రోహిత్ అంత మతిమరుపు ఉన్న వ్యక్తిని తను ఎప్పుడూ చూడలేదని, తన వస్తువులన్నీ రోహిత్ మర్చిపోతూనే ఉంటాడని కోహ్లీ చెప్పాడు. ఐప్యాడ్లు, ఐఫోన్లు, చివరకు పాస్పోర్టు కూడా రోహిత్ మర్చిపోతాడంటూ జోక్ చేశాడు.
కోహ్లీ ఈ విషయం చెప్పి ఆరేళ్లు అయిపోతోంది. అప్పుడు అందరూ రోహిత్ మరీ అంతలా ఎందుకు మర్చిపోతాడు? అని అనుకున్నారు. కానీ కోహ్లీ చెప్పింది అక్షర సత్యం అని తాజాగా రుజువైంది. ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసిన టీమిండియా.. అక్కడ ఎక్కువ సేపు ఉండకుండా ముంబై బయలుదేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హోటల్ రూం ఖాళీ చేసిన ప్లేయర్లు టీం బస్ ఎక్కుతూ కెమెరా కంటికి చిక్కారు.

ఈ సమయంలో రోహిత్ తను పాస్పోర్టు తెచ్చుకోలేదని అర్థమైంది. దీంతో సపోర్ట్ స్టాఫ్ సభ్యుడిని పిలిచి తన పాస్పోర్టు తీసుకురావాలని అడిగాడు. ఇది చూసిన టీంమేట్స్ అందరూ రోహిత్ను ఆటపట్టించారు. సదరు స్టాఫ్ మెంబర్ వచ్చి పాస్ పోర్టు ఇచ్చే వరకు రోహిత్ అక్కడే నిలబడి వెయిట్ చేశాడు. చివరకు అతను పాస్ పోర్టు తీసుకురాగానే.. బస్సులో ఉన్న టీంమేట్స్ అంతా గట్టిగా చీర్ చేస్తూ చప్పట్లు కొట్టారు.
ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రోహిత్ ఇలా వస్తువులు మర్చిపోతూ ఉండటం ఇదేం తొలిసారి కాదు. ఫ్యాన్స్ కూడా ఈ వీడియో చూసి నవ్వుకుంటున్నారు. అదే సమయంలో రోహిత్ గురించి గతంలో కోహ్లీ చేసిన కామెంట్స్ వీడియో కూడా వైరల్ చేస్తున్నారు.
ఆ వీడియోలో కోహ్లీ మాట్లాడుతూ.. 'రోహిత్ అంత మతిమరుపు ఉన్న వాళ్లను నేను ఎక్కడా చూడలేదు. అసలు ఎన్ని వస్తువులు మర్చిపోతాడో తెలుసా? ఐప్యాడ్, ఫోన్, వాలెట్, ఏదో చిన్న విషయం మర్చిపోతే ఏం అనలేం. కానీ రోజూ వాడే వస్తువలు కూడా మర్చిపోతాడు. బస్సు సగం దూరం వెళ్లిపోయాక అరే నా ఐప్యాడ్ ప్లేన్లో ఉండిపోయింది అంటాడు' అని వెల్లడించాడు.
అంతేకాదు అదే వీడియోలో కోహ్లీ మరో ఆసక్తికర విషయం చెప్పాడు. ఒకసారి రోహిత్ తన పాస్పోర్టు మర్చపోతే చాలా కష్టపడి దాన్ని తిరిగి సంపాదించామన్నాడు. 'ఇలా జరుగుతుందనే మా లాజిస్టికల్ మేనేజర్ ఎప్పుడూ వచ్చి రోహిత్ శర్మ అన్ని వస్తువులు తెచ్చుకున్నాడా? అని అడుగుతుంటాడు. రోహిత్ పాజిటివ్ సమాధానం ఇచ్చిన తర్వాతే బస్సు కదులుతుంది' అంటూ కోహ్లీ నవ్వుతున్న వీడియో కూడా వైరల్ అవుతోంది.