గతేడాది ఘోరమైన రోడ్డు ప్రమాదం తర్వాత టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ వేగంగా కోలుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మంచి ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకుంటున్న పంత్.. తన ట్రైనింగ్ వీడియోను తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇది చూసిన ఫ్యాన్స్ చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఆసీస్ స్టార్ డేవిడ్ వార్నర్ కూడా చాలా ఆనందం వ్యక్తం చేశాడు.
పంత్ పూర్తిగా కోలుకొని మైదానంలో దిగే రోజు కోసం ఎదురు చూస్తున్నామని ఫ్యాన్స్ చాలా మంది ఈ వీడియోకు కామెంట్లు పెట్టారు. ఈ క్రమంలోనే బెంగళూరులోని ఎన్సీయేలో పంత్ ఉన్న సంగతి తెలిసిందే. అదే సమయంలో ఆసియా కప్ ప్రిపరేషన్ కోసం టీమిండియా కూడా ఆలూర్ చేరుకుంది. ఇక్కడ కొన్ని రోజుల క్యాంప్ తర్వాత భారత బృందం అంతా కలిసి శ్రీలంక బయలు దేరుతుంది.

అక్కడే ఆసియా కప్లో భారత్ తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. పాకిస్తాన్ను సెప్టెంబర్ 2న ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో ఆలూర్ చేరుకున్న టీమిండియాకు రిషభ్ పంత్ మంచి సర్ప్రైజ్ ఇచ్చాడు. తను వెళ్లి టీమిండియా సహచరులను కలిశాడు. సోమవారం నాడు ప్రాక్టీస్ సెషన్స్ జరుగుతున్న సమయంలో పంత్ అక్కడకు చేరుకున్నాడు.
అక్కడ అందరితో నవ్వుతూ మాట్లాడుతూ సమయం గడిపాడు. భారత ఆటగాళ్లు కూడా పంత్తో సంతోషంగా గడిపారు. ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ప్రస్తుతం పంత్ను చూస్తుంటే అతను వచ్చే ఏడాది ఆరంభంలోనే మళ్లీ మైదానంలో దిగే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోందని సమాచారం. లేదంటే వచ్చే ఐపీఎల్ సమయానికి అతను పూర్తి ఫిట్నెస్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వీటిలో ఏది జరిగినా భారత అభిమానులు సంతోషించడం ఖాయం. గతేడాది నుంచి ఆటకు దూరమైన పంత్ను టీమిండియా అభిమానులు తెగ మిస్ అవుతున్నారు. ముఖ్యంగా టెస్టు ఫార్మాట్లో జట్టుకు పంత్ చాలా ముఖ్యంగా మారిన సంగతి తెలిసిందే.