కొలంబోలో వర్షం కారణంగా పాకిస్తాన్, శ్రీలంక మ్యాచ్ ఆలస్యం అయింది. కొలంబోలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గురువారం ఉదయం నుంచి కూడా ఇక్కడ వర్షం కురుస్తోంది. దీంతో ప్రేమదాస్ స్టేడియంలో మైదానం మొత్తాన్ని కవర్స్తో కప్పేశారు. టాస్ వేసే సమయానికి భారీ వర్షం పడకపోయినా చిన్నపాటి వర్షం పడుతూనే ఉంది.
దీంతో మ్యాచ్ టాస్ ఆలస్యం అయింది. వర్షం కొంత తెరిపిన పడితే కవర్స్ తొలగించిన తర్వాతనే టాస్ వేసి మ్యాచ్ మొదలు పెడతారని సమాచారం. ఈ నేపథ్యంలో మ్యాచ్ పూర్తి 50 ఓవర్లు జరుగుతుందా? అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆసియా కప్ ఫైనల్ చేరడం దాదాపు ఖాయంగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవేళ రద్దయితే మాత్రం నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉన్న జట్టు ఫైనల్ చేరుతుంది.

ఫైనల్లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ చూడాలంటే మాత్రం ఈ మ్యాచ్లో పాకిస్తాన్ కచ్చితంగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఎందుకంటే నెట్ రన్ రేట్ విషయంలో శ్రీలంక మెరుగ్గా ఉంది. ఇలాంటి తప్పక గెలవాల్సిన మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించడంతో పాక్ ఫ్యాన్స్ బాగా చికాకు పడుతున్నారు. సూపర్-4 దశలో ఇప్పటికే రెండు విజయాలు సాధించిన భారత జట్టు ఆసియా కప్ ఫైనల్ చేరుకున్న సంగతి తెలిసిందే.
అయితే శ్రీలంక, పాకిస్తాన్ రెండు జట్లూ కూడా చెరో విజయంతో ఉన్నాయి. ఈ రెండు టీమ్స్ కూడా బంగ్లాదేశ్ను ఓడించాయి. ఆ తర్వాత భారత్తో జరిగిన మ్యాచులో ఓటమి చవిచూశాయి. ఇప్పుడు ఈ రెండు జట్ల మధ్య గెలిచిన జట్టు.. ఆసియా కప్ ఫైనల్లో మళ్లీ భారత్ను ఎదుర్కొంటుంది. దీంతో భారత్, పాక్ ఫైనల్ చూడటం వరుణుడికి ఇష్టం లేదా? అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
వాతావరణ అప్డేట్స్ ప్రకారం గురువారం నాడు కొలంబోలో వర్షాలు పడే అవకాశాలు బాగా ఉన్నాయి. కాబట్టి పాకిస్తాన్, శ్రీలంక మ్యాచ్ పూర్తిగా జరడగం అసాధ్యమని, మహా అయితే ఓవర్లు కుదించిన గేమ్ మాత్రమే జరుగుతుందని ఫ్యాన్స్ అంచనాలు వేస్తున్నారు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్ సమయంలో ఇక్కడ వర్షం పడే అవకాశాలు 65 శాతానికి తగ్గుతాయని అంచనా.