ఆసియా కప్ 2023 వేదిక విషయంలో కొన్ని రోజులుగా పెద్ద గొడవ జరుగుతున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్కు ఈ టోర్నీ ఆతిథ్య హక్కులు దక్కాయి. అయితే తమ జట్టును పాక్కు పంపడం కుదరదని బీసీసీఐ తేల్చిచెప్పింది. అయితే భారత్ కనుక తమ దేశానికి రాకుంటే.. భారత్లో జరిగే వన్డే వరల్డ్ కప్ను తాము బాయ్కాట్ చేస్తామని పాక్ బెదిరించింది కూడా.
అయినా సరే బీసీసీఐ మాత్రం దిగిరాలేదు. తమ జట్టును పాక్కు పంపడం కుదరదని, కాబట్టి ఆసియా కప్ను తటస్థ వేదికలో నిర్వహించాలని డిమాండ్ చేసింది. తమ హోస్టింగ్ హక్కులు కోల్పోవడానికి పాకిస్తాన్ సుముఖంగా లేదు. ఈ క్రమంలో పీసీబీ (పాకిస్తాన్ క్రికెట్ బోర్డు) చైర్మన్ నజామ్ సేథీ కొత్త ప్రతిపాదన చేశాడు.

ఆసియా కప్ను రెండు దశల్లో నిర్వహించాలని నజామ్ సేథీ చెప్పాడు. ఒక దశలో పాకిస్తాన్, మిగతా జట్ల మ్యాచులు జరుగుతాయని తెలిపాడు. ఇక భారత్తో జరిగే మ్యాచులు అన్నింటినీ యూఏఈలో నిర్వహిస్తామని, అలాగే టోర్నీ ఫైనల్ కూడా అక్కడే ఉంటుందని వివరించింది. భారత్ ఫైనల్ చేరకపోయినా ఆ మ్యాచ్ మాత్రం యూఏఈ వేదికగానే నిర్వహిస్తామని తెలిపింది.
ఈ హైబ్రీడ్ మోడల్పై కూడా బీసీసీఐ పెదవి విరిచింది. తమకు దీనిపై పెద్దగా ఇంట్రస్ట్ లేదని తెలిపింది. దానికితోడు తాజాగా జరిగిన ఏసీసీ (ఆసియా క్రికెట్ కౌన్సిల్) సమావేశంలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ కూడా ఈ హైబ్రీడ్ మోడల్పై ఆసక్తి చూపలేదని సమాచారం. ఈ క్రమంలో టోర్నీని శ్రీలంక వేదికగా నిర్వహించాలనే వాదనలు వినిపిస్తున్నాయి.
దీంతో తమకు న్యాయం చేయాలంటూ పీసీబీ చీఫ్ నజామ్ సేథీ.. ఏకంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) దగ్గరకు వెళ్లాడట. తమ హైబ్రీడ్ మోడల్కు ఆమోదం లభించేలా చూడాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది. లేదంటే ఆ తర్వాత పాక్లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో కూడా సమస్య వస్తుందని ఐసీసీ టెన్షన్ పడుతున్నట్లు సమాచారం.