ఆసియా కప్కు అంతా ఓకే అనుకుంటున్న సమయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కాబోయే చైర్మన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఏసీసీ ఆమోదం పొందిన హైబ్రీడ్ మోడల్ వల్ల పాకిస్తాన్కు నష్టం జరుగుతుందని, తనకు ఇది ఏమాత్రం నచ్చలేదని సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో మళ్లీ ఆసియా కప్ జరుగుతుందా? లేదా? అనే చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలో పీసీబీ కాబోయే చూర్మన్ జకా అష్రాప్ క్లారిటీ ఇచ్చాడు.
'నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం, ఈ హైబ్రీడ్ మోడల్ వల్ల పాక్కు ఒరిగే లాభం ఏదీ లేదు. నాకు అది నచ్చలేదు. ఆతిథ్యం ఇవ్వాల్సిన దేశం కాబట్టి.. పాకిస్తాన్ ఇంకొంత బలంగా చర్చించి, టోర్నీ అంతా పాక్లోనే జరిగేలా చర్యలు తీసుకోవాల్సింది. శ్రీలంకలో ఎక్కువ మ్యాచులు జరగడం, పాక్లో కేవలం నాలుగు మ్యాచులే జరగడం వల్ల పాకిస్తాన్కు కలిసొచ్చేది ఏమీ ఉండదు' అని అష్రాఫ్ అన్నాడు.

దీంతో అతను పీసీబీ చైర్మన్ పదవిలో కూర్చోగానే హైబ్రీడ్ మోడల్ను వెనక్కు తీసుకుంటాడని, అవసరమైతే పాకిస్తాన్ ఈ టోర్నీ నుంచి తప్పుకుంటుందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తన వ్యాఖ్యలపై తప్పుడు ప్రచారం జరుగుతోందని అష్రాఫ్ చెప్పాడు. ఇప్పటికే దీనిపై నిర్ణయం తీసేసుకున్నారని, కాబట్టి ఇప్పుడు ఇక ఏమీ చేయలేమని, తాను ఆసియా కప్ను అడ్డుకోనని స్పష్టం చేశాడు.
'ఇప్పటికే ఒక నిర్ణయం తీసేసుకున్నారు. కాబట్టి దాని ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కానీ, దాన్ని రిజెక్ట్ చేయాలని కానీ నేను అనుకోవడం లేదు. ఈ ఒప్పందాన్ని అంగీకరించడం తప్ప నేనేం చేయలేను. అయితే.. ఇకపై తీసుకునే ప్రతి నిర్ణయం కూడా దేశం కోసమే ఉంటుంది. పాక్కు నష్టం కలిగించే నిర్ణయాలు మాత్రం కచ్చితంగా తీసుకోం' అని అష్రాఫ్ వివరణ ఇచ్చాడు.
ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్కు ముందు ఆసియా కప్ జరగాల్సి ఉంది. ఒక విధంగా వరల్డ్ కప్కు ఈ టోర్నీ వార్మప్ వంటిది. వన్డే ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే తమ జట్టును భద్రతా కారణాల దృష్ట్యా పాక్కు పంపడం కుదరదని బీసీసీఐ తేల్చిచెప్పింది. ఈ క్రమంలోనే ప్రత్యామ్నాయంగా హైబ్రీడ్ మోడల్ను పీసీబీ చైర్మన్ నజాం సేథీ ప్రతిపాదించాడు. దీనికి తాజాగా ఏసీసీ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.