ఆసియా కప్ 2023 విషయంలో పాకిస్తాన్కు శుభవార్త వినిపించిందట. ఈ టోర్నీ నిర్వహించేందుకు పాకిస్తాన్ ప్రతిపాదించిన హైబ్రీడ్ మోడల్కు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఆమోదం పలికినట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో వన్డే వరల్డ్ కప్ ముందు ఆసియా కప్ జరుగుతుందన్న సంగతి.
ఈ టోర్నీని నిర్వహించే అవకాశం ఈసారి పాకిస్తాన్కు దక్కింది. అయితే తమ జట్టును అక్కడకు పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సరిగా లేనందున తమ ప్లేయర్లను పాక్కు పంపడం కుదరదని తేల్చేసింది. ఆ దేశంలో తమ జట్టుకు భద్రతా సమస్యలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది.

మిగతా దేశాలు వస్తున్నప్పుడు భారత్కు భయం ఎందుకని పాక్ ప్రశ్నించింది. అయినా సరే తాము మాత్రం జట్టును పంపడం కుదరదని బీసీసీఐ తేల్చేసింది. దీంతో కావాలంటే భారత్ ఆడే మ్యాచులను యూఏఈలో నిర్వహిస్తామని, అంతేకానీ టోర్నీ వేదికను మార్చేందుకు మాత్రం ఒప్పుకోవడం జరగదని పీసీబీ (పాకిస్తాన్ క్రికెట్ బోర్డు) కూడా స్పష్టం చేసింది.
దీనిపై చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. ఈ హైబ్రీడ్ మోడల్పై కూడా బీసీసీఐ కొంత అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఇటీవల పీసీబీ ఈ విషయంలో న్యాయం కోసం ఐసీసీ తలుపులు కూడా తట్టింది. ఈ క్రమంలోనే తాజాగా ఏసీసీ స్పందించినట్లు తెలుస్తోంది. పీసీబీ ప్రతిపాదించిన హైబ్రీడ్ మోడల్కు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందట.
అయితే పాక్ కోరినట్లు భారత్ ఆడే మ్యాచులను యూఏఈలో నిర్వహించడానికి ఏసీసీ ఒప్పుకోలేదని సమాచారం. ఈ మ్యాచులను శ్రీలంకలో ఏర్పాటు చేయాలని సూచించిందట. అంటే భారత్, పాకిస్తాన్ మ్యాచులు కూడా లంకలోనే జరగనుంది. దీనికి పీసీబీ కూడా ఒప్పుకుంది. దీనిపై మరికొన్ని రోజుల్లో ఏసీసీ నుంచి అధికారికంగా ప్రకటన విడుదల అవుతుందని వార్తలు వస్తున్నాయి.