ఆసియా కప్ విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) మధ్య గొడవ జరుగుతూనే ఉంది. భారత జట్టును పాక్కు పంపడం కుదరదని బీసీసీఐ తేల్చి చెప్పడంతో ఆసియా కప్ను హైబ్రీడ్ మోడల్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్తోపాటు శ్రీలంకలో ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు. అయితే శ్రీలంకలో వర్షాల వల్ల ఆసియా కప్ బాగా దెబ్బతింది.
ముఖ్యంగా పాకిస్తాన్, భారత్ మధ్య జరగాల్సిన మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. ఇలా వర్షాల వల్ల ఆసియా కప్ దెబ్బతిని తాము నష్టపోతున్నామని, తమకు ఏసీసీ నష్టపరిహారం చెల్లించాలని పీసీబీ డిమాండ్ చేస్తోందట. అసలు ఈ టోర్నీ పాకిస్తాన్లో జరగాల్సింది. కానీ పాక్కు తమ టీంను పంపడం కుదరదని బీసీసీఐ తేల్చిచెప్పింది. దీంతో చివరకు హైబ్రీడ్ మోడల్లో టోర్నీ నిర్వహించాల్సి వచ్చింది.

అప్పటికీ రెండో వేదికగా యూఏఈని ఎంపిక చేయాలని అప్పటి పీసీబీ చీఫ్ నజాం సేథీ కోరాడట. దానికి కూడా ఏసీసీ ఒప్పుకోలేదని సేథీ ఆరోపణలు చేశాడు. బీసీసీఐ ఒత్తిడితోనే శ్రీలంకలో సగం టోర్నీ నిర్వహించాలని ఏసీసీ డిసైడ్ అయిందని అన్నాడు. ఇక్కడ వర్షాల వల్ల పాకిస్తాన్, భారత్ మ్యాచ్ ఒక్క ఇన్నింగ్స్ మాత్రమే జరిగి ఆగిపోయింది. ఇక నేపాల్, భారత్ మధ్య మ్యాచ్కు కూడా పెద్దగా జనాలు రాలేదు.
ఇలా ప్రేక్షకులు సరిగా రాకపోవడాన్ని ఎత్తిచూపిన పీసీబీ.. దీనికి ఏసీసీనే కారణం అని అక్కసు వెళ్లగక్కిందట. వేదికను మార్చే విషయంలో మిగతా సభ్యులకు కనీసం ఇన్ఫాం కూడా చేయకుండా ఏసీసీ సొంత నిర్ణయాలు తీసుకుందని పీసీబీ చీఫ్ జాకా అష్రాఫ్ మండిపడ్డాడట. భారత్, నేపాల్ మ్యాచ్ తర్వాత బీసీసీఐ, ఎస్ఎల్సీ (శ్రీలంక క్రికెట్), పీసీబీ సమావేశం జరిగిందని కూడా అష్రాఫ్ చెప్పాడు.
సూపర్-4 మ్యాచులను కొలంబోను నుంచి హంబంతోటకు మార్చాలని డిసైడ్ అయినట్లు తెలిపాడు. కానీ చివరకు ఏసీసీ ఎవరికీ చెప్పకుండా కొలంబోనే మ్యాచులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే ఆసియా కప్ టోర్నీ ఆసాంతం తమను ఏసీసీ ఏమాత్రం లెక్కచేయలేదని, కీలక విషయాల్లో నిర్ణయాలు తీసుకునేప్పుడు కూడా తమకు కనీసం సమాచారం ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశాడు.