శ్రీలంక చేతిలో ఓడిపోయి ఆసియా కప్ నుంచి తప్పుకున్న పాకిస్తాన్కు మరో షాక్ తగిలింది. వన్డేల్లో నెంబర్ వన్ టీంగా ఈ టోర్నీ ప్రారంభించిన పాక్.. ఇప్పుడు ఆ స్థానం కోల్పోయింది. పాక్ను టీమిండియా దాటేసింది. తాజాగా విడుదలైన వన్డే ర్యాంకింగ్స్లో పాకిస్తాన్ ఏకంగా మూడో ర్యాంకుకు పడిపోయింది. శ్రీలంకతో జరిగిన వర్చువల్ నాకౌట్ మ్యాచులో పాకిస్తాన్ చివరి బంతికి ఓడిన సంగతి తెలిసిందే.
వర్షం వల్ల 42 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచులో పాకిస్తాన్పై శ్రీలంక ఉత్కంఠ భరిత విజయం సాధించింది. అదే సమయంలో ఆసియా కప్లో భారత్ ఇప్పటి వరకు ఓటమి లేకుండా ఫైనల్కు దూసుకెళ్లింది. ఇప్పుడు బంగ్లాదేశ్తో జరిగే నామమాత్రపు మ్యాచ్ కోసం రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే రేటింగ్ పాయింట్లు కోల్పోయిన పాకిస్తాన్.. వన్డే టీం ర్యాంకింగ్స్లో దిగజారింది.

ప్రస్తుతం 115 పాయింట్లతో ఉన్న పాకిస్తాన్ మూడో స్థానానికి చేరింది. అదే సమయంలో 116 పాయింట్లతో ఉన్న టీమిండియా రెండో స్థానంలో నిలిచింది. వన్డే ర్యాంకింగ్స్లో 118 రేటింగ్ పాయింట్లతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. ఈ ఆసియా కప్లో బ్యాటుతో పెద్దగా రాణించని పాక్ సారధి బాబర్ ఆజమ్ మాత్రం వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో తన అగ్రస్థానం కాపాడుకున్నాడు.
అదే సమయంలో రెండు హాఫ్ సెంచరీలతో రాణించిన శుభ్మన్ గిల్ తన కెరీర్ అత్యుత్తమంగా రెండో స్థానానికి చేరాడు. టాప్ టెన్ వన్డే బ్యాటర్ల జాబితాలో భారత్ నుంచి గిల్, రోహిత్, కోహ్లీ ముగ్గురు ఉండటం గమనార్హం. ఇలా టాప్ టెన్ బ్యాటర్లలో ముగ్గురు భారతీయులు ఉండి చాలాకాలమైంది. గతంలో కోహ్లీ, రోహిత్, ధవన్ ఈ ఘనత సాధించారు. ప్రస్తుతం కోహ్లీ 8వ స్థానంలో, రోహిత్ 9వ స్థానంలో ఉన్నారు.
ఆసియా కప్లో వరుసగా మూడు హాఫ్ సెంచరీలతో రోహిత్ రాణించిన సంగతి తెలిసిందే. ఇక కీలకమైన పాకిస్తాన్ మ్యాచ్లో అజేయ శతకంతో చెలరేగిన విరాట్ కోహ్లీ.. శ్రీలంకపై విఫలమయ్యాడు. ఈ క్రమంలో రోహిత్ తన మంచి ఫామ్ను బంగ్లాపై కూడా కొనసాగించాలని చూస్తుండగా.. ఈ మ్యాచులో మరో భారీ స్కోరు చేసేందుకు కోహ్లీ ఉవ్విళ్లూరుతున్నాడు.