వరల్డ్ కప్కు సన్నాహకంగా అందరూ భావిస్తున్న ఆసియా కప్కు ముహూర్తం దగ్గర పడింది. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ టోర్నీ కోసం ప్రకటించిన జట్టులో మార్పులు చేయాలని డిసైడ్ అయింది. ప్రస్తుతం భీకర ఫామ్లో ఉన్న పాక్ బ్యాటర్ సౌద్ షకీల్ను జట్టులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఇటీవల శ్రీలంకపై టెస్టుల్లో అతను డబుల్ సెంచరీతో రాణించిన సంగతి తెలిసిందే.
గతంలోనే షకీల్ వన్డే అరంగేట్రం చేశాడు. పాక్ తరఫున ఐదు అంతర్జాతీయ మ్యాచులు ఆడినా పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో అతను జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే ఆ తర్వాత పట్టుదలగా పోరాడి టెస్టు అరంగేట్రం చేశాడు. ఈ ఫార్మాట్లో ఇప్పటి వరకు ఏడు మ్యాచులు ఆడిన అతను 87.5 సగటుతో రాణించాడు. శ్రీలంకపై అద్భుతమైన ఇన్నింగ్సులతో ఆకట్టుకున్నాడు.

అయితే ఆసియా కప్ కోసం ప్రకటించిన పాక్ బృందంలో మాత్రం అతనికి చోటు దక్కలేదు. ప్రస్తుతం ఇంత గొప్ప ఫామ్లో ఉన్న అతనికి అవకాశం దక్కకపోవడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. కానీ అతన్ని ఆఫ్ఘనిస్తాన్తో వన్డే సిరీసుకు ఎంపిక చేశారు. ఈ సిరీసులో కూడా అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. చివరి మ్యాచ్లో మాత్రమే ఛాన్స్ దొరికింది.
ఈ మ్యాచ్లో మంచి టచ్లో ఉన్నట్లే కనిపించిన అతను సింగిల్ డిజిట్ స్కోరుకే రనౌట్ అయ్యాడు. దీంతో అతనికి మరిన్ని అవకాశాలు ఇచ్చి ఉండాల్సిందని ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే అతన్ని ఆసియా కప్ టీంలోకి తీసుకుంటున్నట్లు పీసీబీ ప్రకటించింది. ప్రస్తుతం అదిరిపోయే ఫామ్లో ఉన్న అతని చేరికతో పాక్ బ్యాటింగ్ మరింత బలోపేతం అవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ టోర్నీలో పాక్ తమ తొలి మ్యాచ్లో నేపాల్ను ఢీకొంటుందన్న సంగతి తెలిసిందే. ఆగస్టు 30న ఈ మ్యాచ్ జరుగుతుంది.