ఆసియా కప్లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో భారత జట్టుకు పాక్ మాజీ లెజెండ్ గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ముఖ్యంగా టీమిండియా సారధి రోహిత్ శర్మ జాగ్రత్తగా ఉండాలని లేదంటే.. విరాట్ కోహ్లీ సహా మిగతా టీంపై ఒత్తిడి పెరిగిపోతుందని హెచ్చరించాడు. సెప్టెంబర్ 2న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగానే పాక్ ఓపెనింగ్ పేసర్లతో రోహిత్ జాగ్రత్తగా ఉండాలని ఆ టీం మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ చెప్పాడు. షహీన్ అఫ్రిదీ వంటి పేసర్లు కొత్త బంతితో ఏ స్థాయిలో రాణించగలరో అందరికీ తెలిసిందే. ఇటీవలి కాలంలో మళ్లీ ఫామ్ అందుకున్న అఫ్రిదీ.. భారత్పై సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ క్రమంలోనే రోహిత్కు సల్మాన్ బట్ వార్నింగ్ ఇచ్చాడు.

భారత ఓపెనర్లు, మరీ ముఖ్యంగా రోహిత్ శర్మ చాలా జాగ్రత్తగా షహీన్ను ఎదుర్కోవాల్సి ఉంటుందని బట్ అభిప్రాయపడ్డాడు. దీంతో రోహిత్తోపాటు ఆ తర్వాత వచ్చే విరాట్ కోహ్లీపై కూడా ఒత్తిడి తగ్గుతుందని వివరించాడు. యూఏఈ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్లో షహీన్ బౌలింగ్లో రోహిత్ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. కానీ భారత్ పది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
ఈ క్రమంలోనే సల్మాన్ బట్ మాట్లాడుతూ.. 'షహీన్ కొత్త బంతితో రెండు వైపులా స్వింగ్ చేయగలడు. వన్డేల్లో రెండు కొత్త బంతులు ఉంటాయి. కాబట్టి బంతి టీ20ల్లోలా అంత త్వరగా పాతబడదు. కాబట్టి షహీన్ను ఎదర్కొనే విషయంలో రోహిత్ జాగ్రత్తగా ఉండాలి. లేదంటే టీమిండియా కథ మొత్తం మారిపోతుంది. రోహిత్ త్వరగా అవుటైతే.. విరాట్పై ఒత్తిడి పెరుగుతుంది. పాక్కు వీళ్లిద్దరి వికెట్లే కీలకం' అని బట్ చెప్పుకొచ్చాడు.

భారత్, పాక్ మ్యాచ్ అంటేనే ఆటగాళ్లపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుందని, అంతకుముందు ఈ మ్యాచులు ఆడని వాళ్లపై అది మరింత ఎక్కువగా ఉంటుందని అన్నాడు. 'ఎంత ఐపీఎల్ ఆడినా కూడా.. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్లో ఉండే ఒత్తిడి వేరు. కాబట్టి అనుభవం లేని టీమిండియా ప్లేయర్లు ఇది అంత ఈజీ కాదు. కానీ ఇలాంటి పెద్ద వేదికపై రాణిస్తే.. ఆ ఆటగాళ్లు సెన్సేషన్ క్రియేట్ చేస్తారు' అని అభిప్రాయపడ్డాడు.