ఆసియా కప్లో ఆడుతున్న టీమిండియా ఆటగాళ్ల జెర్సీలపై ఆతిథ్య దేశం పాకిస్తాన్ పేరు లేదు. గతంలో ఎలాంటి టోర్నీ జరిగినా ఆ టోర్నీ పేరుతోపాటు, హోస్ట్ నేషన్ పేరు కూడా అన్ని జట్ల జెర్సీలపై ఉండేది. కానీ ఈ ఆసియా కప్లో టీమిండియా జెర్సీపై పాకిస్తాన్ పేరు లేదు. కేవలం 'ఆసియా కప్ 2023' అని మాత్రమే ఉంది. ఇది చూసిన చాలా మంది షాకయ్యారు.
ముఖ్యంగా పాకిస్తాన్ ఫ్యాన్స్ అయితే కీలకమైన టోర్నీల విషయంలో బీసీసీఐ వైఖరి ఇదా? అంటూ మండిపడ్డారు. ఈ క్రమంలో ఇలా భారత్ మాత్రమే కాదు. మిగతా జట్ల జెర్సీలపై కూడా పాకిస్తాన్ పేరు లేకపోవడం వెలుగులోకి వచ్చింది. ఇది పాక్ అభిమానులకు మరింత ఆగ్రహం తెప్పించింది. ఈ నేపథ్యంలో ఇలా ఎందుకు జరిగిందనే విషయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వివరణ ఇచ్చింది.

ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచుల్లో ఒక్క టీం జెర్సీపై కూడా 'ఆసియా కప్ 2023 పాకిస్తాన్' అని లేదు. అలాగని ఈ టోర్నీకి కో-హోస్ట్గా ఉన్న శ్రీలంక పేరు కూడా ఎవరి జెర్సీలపై లేదు. గతేడాది ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్వహించిన మీటింగ్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్తాన్ వెల్లడించింది.
'గతేడాది ఏసీసీ మీటింగ్లో ఈ డెసిషన్ తీసుకున్నాం. ప్లేయర్ల జెర్సీలపై హోస్ట్ దేశం పేరు ఇకపై ఉండదు' అని పీసీబీకి సంబంధించిన వర్గాలు చెప్పాయి. అయితే ఈ వ్యాఖ్యల్లో ఏమాత్రం నిజం లేదని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. ఏసీసీ ఇలాంటి నిర్ణయమే తీసుకోలేదని బీసీసీఐ వాదిస్తోంది.
అయితే ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఉంది. గతేడాది యూఏఈ వేదికగా ఆసియా కప్ జరిగింది. కానీ నిజానికి ఆ టోర్నీ హోస్ట్ నేషన్ శ్రీలంక. దీన్ని సూచిస్తూ ప్లేయర్ల జెర్సీలపై 'శ్రీలంక 2022' అని మెన్షన్ చేశారు. ఇప్పుడు పాకిస్తాన్ పేరు లేకపోవడంతో చాలా మంది అభిమానులు ఏసీసీ డెసిషన్ను తప్పుబడుతున్నారు. దీని వెనుక బీసీసీఐ కుట్ర ఉందని పాక్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.