బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ చేసిన కామెంట్స్ పాక్ క్రికెటర్లకు ఏమాత్రం నచ్చలేదనుకుంటా. తాజాగా ఆ టీం స్టార్ ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్ ఈ కామెంట్స్పై అసహనం వ్యక్తం చేశాడు. ఏదైనా చెప్పడానికి, చెయ్యడానికి చాలా తేడా ఉంటుందంటూ అగార్కర్పై చురకలేశాడు. ఈ కామెంట్స్ విన్న ఫ్యాన్స్ అప్పుడే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హీట్ పెరిగిందంటున్నారు.
ఇటీవల ఆసియా కప్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చీఫ్ సెలెక్టర్ అగార్కర్, రోహిత్ శర్మ ఇద్దరూ కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సమయంలో పాక్ పేసర్లు మంచి ఫామ్లో ఉన్నారని, వారిని టీమిండియా ఎలా ఎదుర్కొంటుందని విలేకర్లు ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ వారి సంగతి విరాట్ కోహ్లీ చూసుకుంటాడని అగార్కర్ చెప్పాడు.

గతేడాది టీ20 వరల్డ్ కప్లో పాక్ పేసర్లపై కోహ్లీ తన ప్రతాపం చూపించిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని గుర్తు చేసిన అగార్కర్.. పాక్ పేసర్ల గురించి తామేం టెన్షన్ పడటం లేదని, వారిని కోహ్లీ ఈజీగా హ్యాండిల్ చేస్తాడని అన్నాడు. ఈ వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన షాదాబ్ ఖాన్.. ఎవరైనా ఏదైనా అనేస్తారని, కానీ క్రికెటర్లు తమ సత్తా ఏంటో మైదానంలో చూపించుకోవాల్సి ఉంటుందంటూ ఫైర్ అయ్యాడు.
తను ఇలా బయట నుంచి వచ్చే కామెంట్స్ను అసలు పట్టించుకోబోనని, సెప్టెంబరు 2న వాస్తవాన్ని చూస్తానని చెప్పాడు. 'ఆ రోజు ఏం జరుగుతుందనేది ముఖ్యం. దానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది. నేనో, ఇంకెవరైనానో, వాళ్ల వైపు నుంచి వేరే వాళ్లో ఏమైనా అనొచ్చు. కానీ దాని వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. మ్యాచ్ జరిగినప్పుడే కదా అసలు ఏం జరుగుతుందో తెలిసేది' అంటూ పరోక్షంగా ఛాలెంజ్ విసిరాడు.
గత టీ20 వరల్డ్ కప్లో భారత్, పాక్ తలపడిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ చెలరేగిన సంగతి తెలిసిందే. ఒకానొక సమయంలో టీమిండియా గెలవడం అసాధ్యం అనుకున్న సమయంలో కోహ్లీ పట్టుదలగా ఆడి జట్టును ఒడ్డుకు చేర్చాడు. ఆ విజయాన్ని క్రికెట్ ప్రేమికులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ మ్యాచ్లో ముఖ్యంగా పాక్ పేసర్లను కోహ్లీ ఎదుర్కొన్న తీరు అద్భుతం. అందుకే అగార్కర్ అలాంటి కామెంట్స్ చేసినట్లు ఫ్యాన్స్ అనుకుంటున్నారు.