ఆసియా కప్ 2023లో టీమిండియా తొలి పరాభవం ఎదుర్కొంది. అది కూడా పసికూన బంగ్లాదేశ్ చేతిలో భారత్ ఓటమి చవిచూసింది. ఈ ఓటమిని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ మాజీ లెజెండ్ షోయబ్ అక్తర్ కూడా టీమిండియాకు చురకలంటించాడు. రెండు మ్యాచులు గెలవగానే కళ్లు నెత్తి మీదకు ఎక్కకూడదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
కొలంబోలోని ప్రేమదాస్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో భారత్పై బంగ్లాదేశ్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన సంగతి తెలిసిందే. బంగ్లా నిర్దేశించిన లక్ష్యానికి ఆరు పరుగుల దూరంలో భారత జట్టు కుప్పకూలింది. దీని గురించి షోయబ్ అక్తర్ తాజాగా స్పందించాడు. ఇలా భారత్ ఓడిపోవడం చూసిన పాకిస్తాన్ చాలా సంతోషిస్తుందంటూ అక్తర్ ట్రోల్ చేశాడు.

'నాతో సహా పాకిస్తాన్ ఫ్యాన్స్కు ఇలా కొంచెం సంతోషం దక్కింది. ఎట్టకేలకు టీమిండియా ఒక మ్యాచ్ ఓడిపోయింది. ఇది భారత్కు కచ్చితంగా ఒక మేలుకొలుపు. రెండు, మూడు మ్యాచులు గెలవగానే ప్రత్యర్థి టీంను తక్కువ అంచనా వేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు' అని అక్తర్ సలహా ఇచ్చాడు.
'భారత్కు ఇది చాలా సిగ్గు తెప్పించే ఓటమి. అయితే మనం వాళ్లను మరీ ఎక్కువ విమర్శించకూడదు. ఎందుకంటే బంగ్లాదేశ్ కూడా ఇక్కడకు ఆడటానికే వచ్చింది. శ్రీలంక చేతిలో పాకిస్తాన్ ఓడిపోతే చాలా మంది తిట్టిపోశారు. శ్రీలంక కూడా చాలా మంచి జట్టే. బంగ్లాదేశ్ కూడా అలాంటిదే. ఆ జట్లన్నీ అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాయని మర్చిపోకూడదు' అని అక్తర్ చెప్పుకొచ్చాడు.
ఈ సమయంలో వరల్డ్ కప్ గురించి కూడా మాట్లాడిన అతను.. ఏ జట్టునూ తక్కువ అంచనా వేయకూడదని చెప్పాడు. చాలా మంది ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, పాకిస్తాన్ జట్లు ఈ మెగాటోర్నీ ఫైనల్ చేరతాయని జోస్యం చెప్పారు. అయితే వీటికి ఎలాంటి గ్యారంటీ లేదని అక్తర్ అన్నాడు.
'వరల్డ్ కప్లో పాకిస్తాన్, ఇండియా ఫేవరెట్లు అని అంటున్నాం. వీటితోపాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ కూడా సెమీస్ చేరతాయని అంచనా. కానీ ఇలా ఆలోచించడం కరెక్ట్ కాదు. చిన్న టీమ్స్ కూడా పెద్ద జట్లను ఇబ్బంది పెడతాయి. ఫలానా వాళ్లు కచ్చితంగా గెలుస్తారని చెప్పలేం. బంగ్లాదేశ్ తాము పసికూనలం కాదని గట్టి స్టేట్మెంట్ ఇచ్చింది. భారత్ త్వరగా మేలుకుంటే మంచిది' అని వార్నింగ్ ఇచ్చాడు అక్తర్,