వచ్చే ఆసియా కప్ గెలిచే సత్తా ఉన్న టీం ఏది? టైటిల్ ఫేవరెట్ ఎవరు? అని అడిగితే కొన్ని రోజుల క్రితం అయితే చాలా మంది టీమిండియా అని చెప్పేవారు. కానీ వెస్టిండీస్లో భారత జట్టు ప్రదర్శన చూసిన తర్వాత అందరికీ అనుమానాలు వచ్చేశాయి. కోహ్లీ, రోహిత్ లేకపోతే ఈ టీంను ఎవరూ గెలిపించలేరని తెలిసిపోయింది.
అంటే ప్రత్యర్థి జట్లు కేవలం వీళ్లిద్దరిపై ఫోకస్ చేస్తే చాలన్నమాట. ముఖ్యంగా టీ20 సిరీసులో భారత కుర్రాళ్ల ఆటతీరు చూసిన తర్వాత టీమిండియా ఫ్యాన్స్ ఆశలు ఆవిరయ్యాయి. ఆసియా కప్లో ఫార్మాట్ మారినా ప్లేయర్లు మారరు కదా. దీంతో హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ను కూడా ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు.

ఒక స్థానంలో రాణిస్తున్న ప్లేయర్ను మరో స్థానంలో బ్యాటింగ్కు పంపడం. మ్యాచ్ మ్యాచ్కూ జట్టులో మార్పులు. కొత్త కొత్త ప్రయోగాలతో టీంను నాశనం చేశాడని అంటున్నారు. దీంతో ఆసియా కప్ గెలవడం అసాధ్యమని ఫీల్ అవుతున్నారు. ఇలాంటి సమయంలో ఆసియా కప్ కోసం ద్రావిడ్ ఎలాంటి ప్లాన్స్ వేస్తున్నాడని తెలుసుకోవడానికి బీసీసీఐ సెక్రటరీ జై షా కదిలాడు.
ఫ్లోరిడాలో ద్రావిడ్ను కలిసిన షా.. ఈ మాజీ లెజెండ్తో భేటీ అయ్యాడు. విండీస్తో చివరి రెండు టీ20లు ఆడుతున్నపుడే ఈ మీటింగ్ జరిగినట్లు సమాచారం. వ్యక్తిగత కారణాలతో ఫ్లోరిడా వచ్చిన జై షాను ద్రావిడ్ కలిసినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో రెండు గంటలపాటు ఆసియా కప్ గురించి వీళ్లిద్దరూ చర్చించుకున్నారట.
టీ20 సిరీసులో భారత్ ఓడిపోవడంతో.. కోచ్గా ద్రావిడ్ ఫ్యూచర్ గురించి కూడా చర్చ జరిగి ఉండొచ్చని సమాచారం. అయితే మరికొన్ని రోజుల్లో ఆసియా కప్ ఉన్న నేపథ్యంలో.. ఈ టోర్నీ కోసం ద్రావిడ్ వ్యూహాలపై బీసీసీఐ ఇంట్రస్ట్ చూపిస్తోందట.
అనవసరమైన మార్పులు, చేర్పులతో ఈ టోర్నీ చేజారకుండా చూసుకోవాలని చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వరల్డ్ కప్ ముందు జరిగే ఈ మేజర్ టోర్నీ టీంకు చాలా ముఖ్యమని స్పష్టం చేసినట్లు సమచాారం.