టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా శుభవార్త చెప్పాడు. ఆసియా కప్లో ఆడాల్సిన అతను తన భార్య డెలివరీ ఉండటంతో ముంబైకి వచ్చిన సంగతి తెలిసిందే. తమ మొదటి బిడ్డ ఈ లోకంలోకి వచ్చే క్షణంలో తను కూడా భార్య పక్కనే ఉండాలని బుమ్రా అనుకున్నాడు. దీని కోసం ముంబై చేరుకున్న అతను నేపాల్తో జరిగే మ్యాచ్కు దూరమవనున్నాడు.
ఈ క్రమంలో సోమవారం ఉదయమే బుమ్రా భార్య సంజన పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని బుమ్రా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించాడు. 'మా చిన్ని కుటుంబ ఇప్పుడు పెద్దదైంది. మా మనసులు ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉన్నాయి. ఈ ఉదయమే మా అబ్బాయి అంగద్ జస్ప్రీత్ బుమ్రా ఈ ప్రపంచంలోకి వచ్చాడు. మా ఆనందానికి అవధుల్లేవు' అని బుమ్రా పోస్టు పెట్టాడు.

అలాగే ఈ కొత్త ఛాప్టర్లో తమ జీవితాల్లో వచ్చే ఆనందాల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు బుమ్రా తెలిపాడు. ఇలా భార్య డెలివరీ కోసం బుమ్రా.. టీమిండియాను వీడటంతో ఆసియా కప్లో నేపాల్తో జరిగే మ్యాచ్లో అతను ఆడటం కుదరదు. అతని స్థానంలో వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతకుముందు పాకిస్తాన్తో మ్యాచ్లో షమీకి జట్టులో చోటు దక్కని సంగతి తెలిసిందే.
ఆసియా కప్ కోసం శ్రీలంకలో ఉన్న బుమ్రా.. సడెన్గా ఆదివారం నాడు స్వదేశానికి బయలు దేరాడు. దీంతో చాలా మంది మళ్లీ బుమ్రాకు గాయమైందా? లేక కుటుంబ సభ్యులకు అనారోగ్యం చేసిందా? అని టెన్షన్ పడ్డారు. అయితే అతని భార్య సంజనా గణేశన్ డెలివరీ ఉన్నట్లు తెలిసి, బుమ్రాకు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు తమకు బిడ్డ పుట్టినట్లు బుమ్రా ప్రకటించడంతో ఫ్యాన్స్ నుంచి మరోసారి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.